హైదరాబాద్ చరిత్రలో మరో మణిహారం చేరింది. ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ భారీ క్యాంపస్ ఇవాళ హైదరాబాద్లో ప్రారంభమైంది. అమెజాన్ క్యాంపస్ ను రాష్ట్ర హోంమంత్రి మహముద్ అలీ ప్రారంభించారు. నానక్రామ్గూడలో 10 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ క్యాంపస్ ప్రపంచంలోనే అతిపెద్దది. 2016, మార్చి 31న అప్పటి పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్.. అమెజాన్ సంస్థ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 15 అంతస్తులుగా 30 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ క్యాంపస్ను నిర్మించారు. ప్రస్తుతం ఈ సంస్థలో 7 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. వచ్చే నెలాఖరు నాటికి ఉద్యోగుల సంఖ్య పది వేలకు చేరుకోనుంది. హైదరాబాద్ క్యాంపస్ నుంచి అమెజాన్ అంతర్జాతీయ కార్యకలాపాలు నిర్వహించనుంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అమెజాన్ ఇండియా సీనియర్ ఉపాధ్యక్షుడు, కంట్రీ మేనేజర్ అమిత్ అగర్వాల్, సంస్థ స్థిరాస్తి, వసతుల మేనేజర్ జాన్ స్కోట్లర్, ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హోంమంత్రి అలీ మాట్లాడుతూ, తెలంగాణకు ఈ క్యాంప్ గర్వకారణమని అన్నారు. గచ్చిబౌలిలోని నానక్రామ్ గూడలో ఏర్పాటు చేసిన ఈ క్యాంపస్.. అమెరికా తర్వాత అతిపెద్ద క్యాంపస్ కావడం విశేషమని తెలిపారు. అమెజాన్ ఇండియా మేనేజర్ అమిత్ అగర్వాల్ మాట్లాడుతూ, గత 15 ఏళ్లలో ఇండియాలో అమెజాన్ రూపుదిద్దుకున్న తీరును ఆయన వివరించారు. కొన్నేళ్ల క్రితం కేవలం అయిదుగురు సభ్యలుతో అమెజాన్ ఏర్పాటు కోసం ఇక్కడకు వచ్చినట్లు ఆయన చెప్పారు. ప్రస్తుతం ఇండియాలో సుమారు 62 వేల మంది అమెజాన్లో పనిచేస్తున్నట్లు ఆయన తెలిపారు.
కాగా, అప్పటి పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా 2016 మార్చి 31న ఈ క్యాంపస్కు శంకుస్థాపన జరిగింది. సుమారు 30 లక్షల చదరపు అడుగుల్లో దీని నిర్మాణం చేపట్టారు. ఇందులో పది లక్షల చదరపు అడుగులను పార్కింగుకు కేటాయించారు. పూర్తిగా అధునాతన నమూనాలో సకల వసతులతో దీనిని నిర్మించారు. అమెజాన్కు ప్రస్తుతం ఏడు వేల మంది ఉద్యోగులున్నారు. వచ్చే నెలాఖరు నాటికి ఈ సంఖ్య పదివేలకు చేరనుంది.