చంద్రయాన్‌-2 అంతరిక్ష ప్రయాణం అనుకున్నట్టుగానే విజయవంతంగా సాగుతోంది. సెప్టెంబర్ ఏడున చంద్రయాన్ 2 చంద్రునిపై ల్యాండింగ్ అవుతుంది. ప్రస్తుతం చంద్రుని కక్ష్యలోకి ప్రవేశించిన ఉపగ్రహం దీర్ఘవృత్తాకారంగా తిరుగుతోంది. కక్ష్య దూరాన్ని ఇప్పుడు మరింత తగ్గించారు. 20 నిమిషాల పాటు మోటార్లను మండించి చంద్రునికి వ్యోమ నౌకకూ మధ్య దూరాన్ని 4,412 కి.మీ మేర తగ్గించినట్లు ఇస్రో తెలిపింది.


ఇక మరో చివరలో చంద్రుని ఉపరితలానికి 118 కి.మీ దూరంలో అంతరిక్ష నౌక ఉంది. ఇంకొన్నిరోజుల్లో ఈ కక్ష్య దీర్ఘవృత్తాకారం నుంచి గుండ్రంగా మారుతుంది. వ్యోమ నౌకకు సంబంధించిన అన్ని పరిమాణాలు సాధారణ స్థితిలోనే ఉన్నాయి. భారత దేశం సగర్వంగా ప్రయోగించిన చంద్రయాన్ 2 ప్రయోగం ఇప్పుడు కీలక దశకు చేరుతోంది.


గత నెల 22న శ్రీహరికోట నుంచి అంతరిక్షంలోకి దూసుకెళ్లింది. అంతకు కొన్ని రోజుల ముందే ఈ ఉపగ్రహ ప్రయోగం జరగాల్సి ఉన్నా.. చివరి నిమిషంలో ఓ పొరపాటును గ్రహించి ప్రయోగాన్ని అనూహ్యంగా వాయిదా వేశారు. చివరకు జూలై 22న చంద్రయాన్ ను విజయవంతంగా అంతరిక్షంలోకి పంపారు.


ఈ ఉపగ్రహ నియంత్రణ అంతా బెంగళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయం నుంచే జరుగుతోంది. చంద్రుని కక్ష్యలో చంద్రయాన్ ఉపగ్రహం ఏడు రోజులపాటు ప్రయాణిస్తుంది. ఆ తర్వాత చంద్రుని చేరుకుంటుంది. ఈ ఏడు రోజులు కూడా ఉపగ్రహ గమనాన్ని ఇస్రో నుంచి శాస్త్రవేత్తలు నియంత్రిస్తుంటారు. ప్రస్తుత అంచనా ప్రకారం.. సెప్టెంబరు 7న వాహన నౌక ల్యాండర్‌, రోవర్‌ను తీసుకెళ్లి చంద్రుని దక్షిణ ధ్రువం పై దింపే అవకాశం ఉంది.. ఇస్రో అతి తక్కువ ఖర్చుతో చేసిన ఈ ప్రయోగం విజయవంతమైతే.. భారత్ కు అంతరిక్ష రంగంలో అగ్రరాజ్యాల సరసన నిలుస్తుంది. విశ్వవీధిలో భారత పతాక రెప రెప లాడటం ఖాయం.


మరింత సమాచారం తెలుసుకోండి: