2018 వ సంవత్సరంలో వస్తుంది అనుకున్నదానికంటే భారీ మెజారిటీతో తెరాస పార్టీ విజయం సాధించింది. తెరాస పార్టీ విజయం సాధించింది అని చెప్పేకంటే కూడా.. కాంగ్రెస్ పార్టీ తరపున బాబు చేసిన ప్రచారమే కెసిఆర్ కు కలిసి వచ్చింది అని చెప్పొచ్చు. ఎందుకంటే.. 2014లో రాష్ట్రం విడిపోయిన తరువాత నోటుకు ఓటు కేసులో బాబు ఇరుక్కున్నారు. అక్కడే ఉంటె బాగుండదని చెప్పి విజయవాడకు వచ్చారు. అమరావతి పేరుతో రాజధానిని ప్లాన్ చేశారు.
అంతా బాగుంది. అసలు చిక్కు ఎక్కడ ఉంది అంటే.. 2018 ఎన్నికల సమయంలో బాబు కాంగ్రెస్ పార్టీతో చేతులు కలపడంతో మొత్తం మారిపోయింది. అసలే కాంగ్రెస్ పార్టీ కోలుకోలేకుండా ఉండిపోయింది. దాంతోపాటు కాంగ్రెస్ తో తెలుగుదేశం పొత్తు పెట్టుకోవడంతో తెరాస కు కలిసి వచ్చింది. భారీ మెజారిటీ వచ్చింది. 2018లో తిరిగి తెరాస పార్టీ అధికారంలోకి వచ్చింది.
ఇంతవరకు బాగుంది. అయితే, 2019 లో తెలంగాణాలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో అదే విధంగా అనుకుంది. 17 స్థానాల్లో 16 తమవే అని ప్రచారం చేసింది. రిజల్ట్ తరువాత వ్యవహారం పూర్తిగా మారిపోయింది. తెరాస పార్టీ కేవలం 9 స్థానాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఉద్యమకాలం నుంచి తనతో కలిసి పనిచేసిన వినోద్ కరీంనగర్ నియోజక వర్గం నుంచి ఓటమిపాలయ్యారు. అటు కెసిఆర్ కూతురు కవిత నిజామాబాద్ నుంచి ఓటమిపాలైంది. ఈ ఇద్దరు ఓడిపోవడం కెసిఆర్ కు పెద్ద దెబ్బగా మారింది.
అయితే, వినోద్ కు ప్రణాళిక సంఘం అధ్యక్షుడిగా పదవిని కట్టబెట్టారు. వినోద్ ఆ పదవిలోనే ప్రస్తుతం కొనసాగుతున్నారు. ఇప్పుడు కవితకు కూడా నామినేటెడ్ పదవిని ఇచ్చే ఆలోచనలో కెసిఆర్ ఉన్నట్టుగా తెలుస్తోంది. నిజామాబాద్ లో కవిత ఓటమిపాలవ్వడనికి రైతులే ప్రధాన కారణం కాబట్టి రైతు సమన్వయ కమిటీ అనే ఒక పదవిని సృష్టించి దానికి కవితను అధ్యక్షురాలిగా చేయాలని కెసిఆర్ అనుకుంటున్నారు. లేదంటే తెలంగాలో ఎమ్మెల్సీ సీటు ఇచ్చి.. మంత్రిని చేయాలని అనుకుంటున్నారని టాక్. కానీ కవిత మాత్రం దీనికి ఒప్పుకునే విధంగా లేదని తెలుస్తోంది. కవిత దీనికి వ్యతిరేకంగా ఉందని,ప్రజా క్షేత్రంలో గెలిస్తేనే పదవి తీసుకోవాలని అనుకుంటుందని సమాచారం. మరి కవితను కెసిఆర్ గెలిపించుకుంటారా చూద్దాం.