ఏపీ ముఖ్యమంత్రి జగన్ వారిని ఏరి కోరి తెచ్చుకున్న వారే ఇప్పుడు ఆయన పాలిట పరమానంద శిష్యులుగా మారిపోయారన్న విమర్శలు వస్తున్నాయి. జగన్ కేబినెట్లో కీలక మంత్రులు సైతం పొంతన లేని వ్యాఖ్యలు చేస్తూ జగన్తో పాటు పార్టీని ఇబ్బంది పెట్టేలా వ్యవహరిస్తుండడంతో వైసీపీ వాళ్లే మంత్రులను పరమానంద శిష్యులతో పోలుస్తూ సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు. ముఖ్యమంత్రి విదేశాలకు వెళ్తే..ఎవరికి వారు ప్రకటనలు చేస్తున్నారు. కొత్త సమస్యలకు కారణం అవుతున్నారు.
ఎవరైతే తనకు బలంగా ఉంటారని భావించి జగన్ మంత్రులను చేశారో... వారే ఇప్పుడు ఆయనకు బలహీనంగా మారుతున్నారు. మున్సిపల్ మంత్రి రాజధాని పైన ప్రకటన చేస్తామని చెబుతారు. ఆయన అలా ప్రకటన చేశారో ? లేదో వెంటనే దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ స్టార్ట్ అయ్యింది. విపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు ప్రారంభించేశాయి. దీంతో రాజధాని జిల్లా జనాలతో పాటు చాలా మంది సామాన్యుల్లో పెద్ద అనుమానాలు వచ్చేశాయి. ఇది పెద్ద మైనస్ అయ్యింది.
ఇక మరో మంత్రి రాజధాని మార్పు ఉండదని.. అమరావతే రాజధాని అని చెప్పారు. దీంతో అసలు మంత్రుల మధ్య సఖ్యత లేదా ? ఎవరు నిజం చెపుతున్నారు ? ఎవరిని నమ్మాలి ? అన్నది ఎవ్వరికి క్లారిటీ లేని పరిస్థితి. ప్రభుత్వంలో ఒక విధానం లేదా ? అసలు జగన్ ఏం చేస్తున్నారన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి. గతంలో అమ్మ ఒడి పధకం గురించి మంత్రి ప్రకటనతో అయోమయం ఏర్పడింది.
చివరకు జగన్ ఏరికోరి మరీ తెచ్చుకున్న మంత్రులు ప్రతిపక్షాల విమర్శలకు అస్కారం ఇవ్వడంతో పాటు ప్రజల్లోనూ ప్రభుత్వం పట్ల పెద్ద కన్ఫ్యూజన్ ఉందన్న సందేహాలు కలిగేలా ప్రవర్తిస్తున్నారు. రాజధానిపై త్వరలోనే ప్రకటన ఉంటుందని బొత్స చేసిన ప్రకటనతో రాష్ట్రవ్యాప్తంగా అందరూ రాజధాని తరలి వెళ్లిపోతుందని చర్చించుకోవడం మొదలు పెట్టేశారు.
ఈ టైంలో ప్రభుత్వాన్ని టీడీపీ నేతలు టార్గెట్ చేయడం ఒక ఎత్తు అయితే... అటు బీజేపీ నేతలు సైతం ఈ ఆలోచనను తప్పు బట్టారు. టీడీపీ ఎంపీ కేశినేని నాని ముఖ్యమంత్రిని తుగ్లక్ గా అభివర్ణించారు. ఆ తర్వాత తేరుకున్న వైసీపీ దీనిని సమర్థించుకుంటూ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నా... అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఏదేమైనా జగన్ విదేశీ పర్యటన నుంచి వచ్చిన వెంటనే మంత్రులను బాగా కంట్రోల్లో పెట్టాల్సిన అవసరం కనిపిస్తోంది.