ఆర్టికల్ 370 తరువాత పాకిస్తాన్ ఇండియాపై ఒంటికాలితో లేస్తుంది. అవకాశం దొరికితే చాలు ఇండియాను విమర్శిస్తోంది. అంతేకాదు ఇండియా రాజకీయాల్లో తలదూర్చి చిచ్చు పెట్టాలని చూస్తున్నది పాకిస్తాన్. అలా తలదూర్చిన ప్రతిసారి... తలంటి పోయించుకుంటోంది. అక్కడితో ఆగకుండా ఇటీవలే కొన్ని మాటలు మాట్లాడింది. అది బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా గురించి.
బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా న్యూయార్క్ లో జరిగిన ఓ కార్యక్రమంలో పాక్ యువతి అడిగిన ప్రశ్నకు ఘాటుగా సమాధానం ఇచ్చిన సంగతి తెలిసిందే. బాలాకోట్ వైమానిక దాడుల విషయంలో మీ దేశాన్ని సమర్ధిస్తూ జైహింద్ అని చెప్పడం సమంజసం కాదని ఆ మహిళా అడగడంతో.. దానిపై ప్రియాంక ఘాటుగా రిప్లయ్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
దీనిపై పాక్ మానవ హక్కుల సంఘం స్పందించిన సంగతి తెలిసిందే. ప్రియాంక చోప్రాను గుడ్ విల్ అంబాసిడర్ గా తొలగించాలని కోరుతూ యూనిసెఫ్ కు లేఖ రాసింది. దీంతో పాటు అటు పాక్ ప్రధాని కూడా ప్రియాంక చోప్రాను తొలగించాలని కోరుతూ లేఖ రాశాడు. దీనిపై యూనిసెఫ్ స్పందించింది. ప్రియాంక చోప్రాను తొలగించాల్సిన అవసరం లేదని పేర్కొన్నది.
యూనిసెఫ్ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనే సమయంలో మాత్రమే వారు దానికి అనుగుణంగా నడుచుకోవాలని, వ్యక్తిగతంగా ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయని అన్నారు. యునిసెఫ్ గుడ్ విల్ అంబాసిడర్లు తమ వ్యక్తిత్వం మేరకు మాట్లాడుకోవచ్చు. ఆందోళనకు గురిచేసే, ఆసక్తి కలిగించే అంశాలపై మాట్లాడే హక్కు వాళ్లకుంది.
వారి వ్యక్తిగత అభిప్రాయాలు, అభిరుచులు, చర్యలు యునిసెఫ్ మీద ఎలాంటి ప్రభావం చూపవని సమాధానం ఇచ్చింది యూనిసెఫ్. ఐక్యరాజ్య సమితి ఇచ్చిన సమాధానంతో పాక్ కుదిమ్మ తిరిగిపోయింది. ఐక్యరాజ్య సమితి నుంచి ఇలాంటి సమాధానం వస్తుందని ఎవరూ ఊహించలేదు. ఊహించని విధంగా వచ్చిన ఈ సమాధానం అందరిని ఆశ్చర్యపరిచింది.