రాష్ట్రంలో కేసీఆర్ సర్కార్ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ ప్లాన్ రెడీ చేసిందా.. తెలంగాణలో పాగా వేయాలని తహతహలాడుతున్న కమలనాథులకు విద్యుత్ కుంభకోణం అంశం అస్త్రంగా మారనుందా.. అంటే బీజేపీ శ్రేణుల నుంచి అవుననే సమాధానం వస్తోంది. కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మం త్రి చిదంబరం విషయంలో భాజపా ఆపరేషన్ ఎలా ఉందో స్పష్టమవుతోంది.
పార్టీ ఒక లక్ష్యాన్ని నిర్దేశించు కుంటే సామ దాన భేద దండోపాయాలు అన్నీ ఉపయోగించైనా సరే, దారిలోకి తెచ్చుకోవడం బీజేపీకి అ లవాటు. అయితే ప్రస్తుతం తెలంగాణపై దృష్టి సారించిన బీజేపీ, కేసీఆర్ ను కూడా టార్గెట్ చేసిందనే అనుమానాలు కలుగుతున్నాయి. అసలు విషయానికి వస్తే... రాష్ట్రంలో భారీ విద్యుత్ కుంభకోణం జరిగిందనీ, దాన్ని బయటకి రాకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ జాగ్రత్త పడుతున్నారని ఆరోపించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్.
జాతీయ సోలార్ విధానంలో టెండర్లు పలిచినట్టు పిలిచీ, కమిషన్లకు కక్కుర్తిపడి దాన్ని పక్కనపడేశారన్నారు. 4 రూపాయల 30 పైసలకు యూనిట్ విద్యుత్ ఇస్తామని ముందుకొచ్చినవారిని కాదని, 5 రూపాయల 50 పైసలకు ఇతర కంపెనీలతో ఒప్పందాలను కేసీఆర్ సర్కారు కుదుర్చుకుందన్నారు. తక్కువ ధరకు వస్తుంటే కాదని, ఎక్కువ ధరకు ఎందుకు ఒప్పందాలు కుదుర్చుకున్నారో కేసీఆర్ చెప్పగలరా అని ప్రశ్నించారు?
అంతేగాక తాము చేస్తున్న ఆరోపణలపై ఒక సిట్టింగ్ జడ్డితో విచారణ జరిపించగలరా, ఈ కుంభకోణం అవాస్తవం అని కేసీఆర్ నిరూపించగలరా అంటూ సవాల్ చేశారు లక్ష్మణ్. దేశంలోనే అత్యంత అసమర్థ విద్యుత్ సంస్థ ఇండియా బుల్స్ అనీ, అయినా రాష్ట్ర ప్రభుత్వం ఆ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుందనీ, ఇప్పటివరకూ ఒక్క యూనిట్ కూడా అక్కడి నుంచి వచ్చింది లేదన్నారు.
రాష్ట్రంలో ఇలాంటి స్కాములపై త్వరలోనే కేంద్రం దృష్టి సారిస్తుందని సంకేతాలు ఇచ్చారు లక్ష్మణ్. అయితే ఈ ఆ రోపణలపై కేసీఆర్ సర్కారు ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.. అవినీతి ఆరోపణలపై సీఎం కేసీఆర్ ను ఇరుకున పెట్టాలనుకుంటున్న బీజేపీ ఆశలు ఏమేరకు సఫలీకృతం అవుతాయో వేచి చూడాల్సిందే.. !