ఎనిమిది రోజుల పాటు అమెరికాలో గడిపిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఈ రోజు తెల్లవారుజామున అమరావతి చేరుకున్నారు. ఆయన మళ్ళీ పాలనాపరమైన పనుల్లో బిజీ కానున్నారు. దాదాపుగా ఈ నెలల్లో పదిహేను రోజుల పాటు ఆయన విదేశీ పర్యటనల్లోనే గడిపారు. ఆగస్ట్ 1 నుంచి జెరూసలెం టూర్ చేస్తే ఆగస్ట్ 15 నుంచి అమెరికా టూర్ చేశారు. మొత్తానికి జగన్ ఈ నెలలో పాలన మీద పెద్దగా ద్రుష్టి సారించలేకపోయారని చెప్పాలి.
ఇక ఇపుడు జగన్ మళ్ళీ రాజకీయంతో పాటు, పాలన మీద కూడా సీరియస్ గా లుక్కేయనున్నారు. ఏపీలో రచ్చగా మారిన రాజధాని విషయంలో జగన్ ఏం చెబుతారా అని అంతా ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. రాజధానిని మార్చబోమని జగన్ స్పష్టం చేయాలని ఇప్పటికే టీడీపీ సహా ప్రతిపక్షాలు గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. అదే సమయంలో రాజధాని విషయంలో వస్తున్న గాలి ప్రచారానికి చెక్ పెట్టాలని వైసీపీలోనూ వాదన బలంగా ఉంది.
ఎవరెన్ని చెప్పినా కూడా జగన్ మాటే ఫైనల్ కాబట్టి జగన్ ఏం చెబుతారా అని రైతులు సైతం ఆసక్తిగా ఉన్నారు. మరి జగన్ ఏదో ఒకటి చెప్పాలని అంతా అనుకుంటున్న వేళ జగన్ ఈ విషయమై ఒకటి రెండు రోజుల్లో క్లారిటీ ఇస్తారా అన్నది చర్చగా ఉంది. జగన్ అమరావతి విషయంలో ఇప్పటివరకూ ఓ అస్పష్టమైన వైఖరినే ప్రదర్శించారు. ఆయన ఎన్నికల మ్యానిఫేస్టోలో కూడా అమరావతి అంశం ప్రస్తావన చేయలెదు
ఇక బడ్జెట్లో సైతం కేవలం 500 కోట్ల రూపాయలే కేటాయించారు. అటువంటి సందర్భంలో జగన్ ఇంకా కొన్ని రోజులు ఇదే సందిగ్దతను కొనసాగించాలనుకున్నారేమో తెలియదు కానీ ఆయన మంత్రివర్గ సహచరుడు బొత్స సత్యనారాయణ రాజధాని విషయంలో చేసిన వివాదాస్పద కామెంట్స్ ఇపుడు జగన్ ఏదో ఒకటి చెప్పేలా చేసే పరిస్థితిని స్రుష్టించాయి. మరి జగన్ కి అమరావతి ఉన్న మోజు ఎంత, దొనకొండ మీద ఉన్న ప్రేమ ఎంత, అసలు రాజధాని మార్పు ఉంటుందా, ఉండదా అన్నది జగన్ మాత్రమే చెప్పగలిగే విషయాలు.
జగన్ చెబితేనే జనం కూడా పూర్తిగా నమ్మే విషయాలు కూడా. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ జాప్యం లేకుండా జగన్ రాజధాని విషయంలో ఓ క్లారిటీ ఇస్తే బాగుంటుందని అంతా అనుకుంటున్నారు. ఒకటి రెండు రోజుల్లో జగన్ నుంచి కచ్చితమైన విధాన ప్రకటన ఈ అంశంపై ఉండొచ్చని అంతా భావిస్తున్నారు. చూడాలి మరి జగన్ ఏం చెబుతారో. అంత వరకూ అందరిలో ఆ టెన్షన్ మాత్రం తప్పదు.