సెల్ఫీ.. ఇప్పుడు ఇది ఎంతగా ఫేమస్ అయ్యిందో చెప్పక్కర్లేదు. నిత్యం సోషల్ మీడియాలో వందలాది సెల్ఫీలు పోస్ట్ అవుతుంటాయి. రోడ్డుపై వెళ్తూ ఫోటోలు దిగడం నుంచి సాహసాలు చేస్తూ ఫోటోలు దిగటం వంటివి చేస్తుంటారు. ఇటీవలే ఆస్ట్రేలియాకు చెందిన ఓ మహిళ సెల్ఫీ కోసం 10వేల డాలర్లు ఖర్చు చేసి డిస్నీ థీమ్ పార్క్ కు వెళ్లి ఫోటోలు దిగింది. అలా ఫోటోలు దిగడం వెనుక కథ కూడా ఉన్నట్టు చెప్పింది. తన సోదరుడు నిత్యం ప్రయాణాలు చేస్తూ మంచి మంచి ఫోటోలు దిగుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటాడని, అందుకే తాను కూడా అలా దిగాలని చెప్పి అప్పుచేసి మరి డిస్నీ వెళ్లి ఫోటోలు దిగినట్టు చెప్పింది.
కేవలం ఆ ఒక్క మహిళే కాదు... ఇలా ఎందరో సెల్ఫీలకోసం తాపత్రయ పడుతుంటారు. సాహసాలు చేస్తుంటారు. ప్రాణాలు పోగుట్టుకుంటుంటారు. జూలో సింహం దగ్గర సెల్ఫీ దిగుతూ ప్రాణాలు కోల్పోయిన ప్రబుద్ధులు ఎందరో. ఇదిలా ఉంటె, తమిళనాడులోని ఊటీలో సెల్ఫీగోల ఎక్కువైంది. ఊటీ వెళ్లే రైళ్లు ఈ సెల్ఫీ గోలతో ఇబ్బందులు పడుతున్నాయి. మలుపులు, ఎత్తులు ఎక్కే సమయంలో ట్రైన్ స్లో అవుతుంది. అలా స్లో అయినపుడు ప్రయాణికులు. గబగబా ట్రైన్ దిగి ఇంజన్ ముందుకు వెళ్లి సెల్ఫీలు దిగుతున్నారట.
అక్కడితో ఆగకుండా.. ఇంకాస్త అత్యుత్సాహం చూపుతూ.. రైలు పట్టాలపై పడుకొని సెల్ఫీలు దిగుతున్నారు. ఇలా చేయడం వలన సమస్యలు వస్తున్నాయి. రైల్వే అధికారులపై విమర్శలు వస్తున్నాయి. ఎన్నిసార్లు హెచ్చరించినా తీరు మారకపోతుండటంతో.. అధికారులు అలోచించి ఓ కొత్త విధానానికి శ్రీకారం చుట్టారు. అప్పటికైనా దారిలోకి వస్తారేమో అని పాపం ఎదురుచూస్తున్నారు. ఆ విధానం ఏమిటంటే ఫైన్.
ఇలాంటి ఆగడాలను అరికట్టడానికి ఫైన్ అనే కఠినమైన నిబంధనలు విధిస్తేనే దారిలోకి వస్తారు. ఒకటి రెండు సార్లు ఫైన్ కడితే వాళ్ళకే బుద్ధివస్తుంది. పట్టాలపై సెల్ఫీ దిగితే రెండువేలు ఫైన్, టికెట్ లేకుండా లేకుండా ఫ్లాట్ పామ్ మీద ఉంటె 1000, టికెట్ లేకుండా ప్రయాణం చేస్తే 2000, పట్టాలపై వ్యర్ధాలు వేస్తె 200, అపరిశుభ్రం చేస్తే 300 రూపాయలు ఫైన్ చేసేందుకు ఊటీ రైల్వే సిద్ధం అయ్యింది. దీనికి సంబంధించిన ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. సో, ఇప్పుడు ఎవరైనా సరే ఇలా చేస్తే జేబుకు చిల్లులు పడాల్సిందే.