ఒక షాప్ పెట్టాలి ఆ షాప్ లో ఉండే వస్తువుల కోసం పెట్టె పెట్టుబడి కంటే.. షాప్ పెట్టడానికి కావాల్సిన పెట్టుబడి అధికంగా ఉంటుంది. అంటే షాప్ రెంట్ 10 వేలు ఉంటె.. దానికి ఇవ్వాల్సిన అడ్వాన్స్ రెండు మూడు లక్షల అరకు ఉంటుంది. కానీ, అందుకు విరుద్ధంగా కేవలం ఒక్క రూపాయి అద్దె ఇస్తే చాలు అంటున్నారు షాప్ యజమానులు. మరీ తక్కువ.. అదేంటి అందులో ఏమైనా తిరకాసు ఉన్నదా ఏంటి అని షాక్ అవ్వకండి.. అక్కడికే వస్తున్నా..
ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం దశలవారీగా మద్యపాన నిషేధాన్ని విధిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ప్రైవేట్ వ్యక్తులు మద్యం షాపులను నిర్వహించేవారు. టెండర్లు వేసి మద్యం షాపులు తీసుకునే వారు. కానీ వచ్చే అక్టోబర్ నుంచి ప్రభుత్వమే సొంతంగా మద్యం షాపులను నిర్వహస్తోంది. మద్యం షాపుల్లో పనిచేసే వ్యక్తులను కూడా ప్రభుత్వం నియమిస్తోంది. ఈ షాపులు టైమింగ్ ప్రకారం పనిచేస్తాయి. ఎప్పుడుపడితే అప్పుడు ఉండవు.
ఆదివారాలు పనిచేయవు. పండుగ వేళల్లో ఓపెన్ చేయరు. ప్రభుత్వం నిర్వహిస్తున్న షాపులు కాబట్టి డిమాండ్ ఉంటుంది. ఈ షాపుల కోసం ఓపెన్ టెండర్లను ఆహ్వానించింది. అయితే ఎవరూ ఊహించని విధంగా టెండర్లు వచ్చాయి. దీంతో ప్రభుత్వం షాక్ అయ్యింది. ప్రభుత్వం నిర్వహిస్తోంది కాబట్టి అద్దెలు భారీగా ఉంటాయని అనుకున్నారు.
కానీ, అద్దె చాలా తక్కువగా కోట్ చేశారట. కేవలం ఒక్క రూపాయి ఇస్తే చాలు.. అని కొందరు టెండర్ వేసినట్టు తెలుస్తోంది. మరీ అంత తక్కువ అని షాక్ అవ్వకండి.. తక్కువే మరి. ఇలా ఒక్క రూపాయి ఇస్తే చాలు అని చెప్పి చాలామంది టెండర్లు వేశారు. ఏం ఆశించి వీరంతా ఇలా అతి తక్కువ టెండర్లు వేశారో అర్ధంకాని విషయం. ఏది ఏమైతేనేం.. ప్రభుత్వానికి తక్కువ ధరకు షాప్ దొరుకుతున్నప్పుడు అంతకంటే ఏం కావాలి చెప్పండి.