కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దేశంలో ఎలా ఉన్నదో చెప్పక్కర్లేదు. దేశంలో క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నది అనే నానుడి ప్రకారం దేశంలో కాంగ్రెస్ పరిస్థితి కూడా అలానే ఉన్నది. కాంగ్రెస్ పార్టీ కోలుకునే అవకాశం కనిపించడం లేదు. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో డీలా పడిపోయింది. ఆంధ్రప్రదేశ్ లో జీరో. తమిళనాడులో అంతంత మాత్రంగానే ఉన్నది. ఇక తెలంగాణాలో ఇన్ పేషెంట్ గా మారిపోయింది. ఉత్తర ప్రదేశ్ లో ఐసియులో ఉన్నది.
అయితే, కాంగ్రెస్ పార్టీకి తిరిగి పునర్వైభవాన్ని తీసుకొచ్చేందుకు పాపం సీనియర్ నేతలు చాలా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కలిసి వచ్చే పార్టీలతో పొత్తు పెట్టుకోవడం తమకు బలం ఉన్న చోట పోటీ చేయడం.. బలహీనంగా ఉన్న చోట పొత్తుపెట్టుకొని పోటీ చేసి అక్కడ కూడా విజయం సాధించేలా చూసుకోవడం వంటి వాటిని అమలు చేయడానికి సిద్ధం అవుతున్నది.
త్వరలోనే బెంగాల్లో నాలుగు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అక్కడ 2 స్థానాలు మాత్రమే గెలుచుకుంది. దశాబ్దాలపాటు చక్రం తిప్పిన వామపక్షాలు అక్కడ ఖాతా తెరవలేదు. తృణమూల్ 22 స్థానాలతో సరిపెట్టుకుంటే బీజేపీ అనూహ్యంగా పుంజుకొని 18 స్థానాల్లో విజయం సాధించింది. బీజేపీ నెక్స్ట్ టార్గెట్ బెంగాల్ ను పెట్టుకుంది.
ఇక్కడ విషయం ఏంటి అంటే త్వరలో జరగబోయే నాలుగు అసెంబ్లీ నియోజక వర్గాల్లో వామపక్షాలకు పట్టు ఉంది. దాన్ని ఎలాగైనా ఉపయోగించుకోవాలని కాంగ్రెస్ పార్టీ చూస్తోంది. ఇందులో భాగంగానే కాంగ్రెస్ వామపక్షాలతో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమైంది. వామ పక్షాలు కూడా ఇందుకు రెడీగా ఉన్నాయి. కాంగ్రెస్, వామ పక్షాలు కల్సి ఎలాగైనా ఆ నాలుగు నియోజక వర్గాలను గెలుచుకోవాలని చూస్తున్నాయి. కానీ, బిజేపి, టిఎంసిలు కూడా ఉప ఎన్నికల్లో సత్తా చాటాలని ప్రయత్నం చేస్తున్నాయి. మరి ఈ ప్రయత్నాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయో చూడాలి.