తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన అనంతరం తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు ఎవరు ? షాక్ ఇస్తారో ? తెలియని పరిస్థితి. ఒకేసారి నలుగురు రాజ్యసభ సభ్యులు పార్టీని వీడడంతో స్టార్ట్ అయిన షాకుల పర్వం ఆగడం లేదు. ఇప్పుడు పరిస్థితి ఇలా ఉంటే వచ్చే ఐదేళ్ల పాటు బాబు పార్టీని ఎలా నడిపిస్తారో ? అంచనాలకే అందడం లేదు. మరోవైపు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి జోరుమీదున్న బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్కు తెరలేపిన విషయం విదితమే. ఇందులో భాగంగా ఇప్పటికే పలు పార్టీలకు చెందిన నేతలు కాషాయ కండువా కప్పేసుకున్నారు.
ఏపీ కంటే కూడా తెలంగాణపై బీజేపీ బాగా కాన్సంట్రేషన్ చేసింది. తెలంగాణలో 2024 ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా కమలనాథులు ముందుకెళ్తున్నారు. ఐదేళ్ల తర్వాత ఎన్నికలు ఉన్నా తెలంగాణలో బీజేపీ వాళ్లు మాత్రం ఇప్పుడే ఎన్నికలు ఉన్నాయన్నట్టుగా క్షేత్రస్థాయిలో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ పార్టీల నుంచి వచ్చే నేతలను కాదనకుండా కమలనాథులు కండువా కప్పేసుకుంటున్నారు.
ఇదిలా ఉంటే తెలంగాణకు చెందిన ఇద్దరు కీలక నేతలు బీజేపీలో చేరేందుకు రెడీ అవుతున్నారు. వారిలో కాంగ్రెస్ మహిళా నేత కొండా సురేఖ, టీడీపీ సీనియర్ నేత రేవూరి ప్రకాశ్రెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే తెలంగాణలో టీడీపీ పరిస్థితి ఖల్లాస్ అయ్యింది. అక్కడ ఆ పార్టీ పేరు తలిచే వాళ్లే లేరు. ఈ క్రమంలోనే ఇప్పటి వరకు పార్టీకి, చంద్రబాబుకు అత్యంత విశ్వాసపాత్రుడిగా ఉన్న రేవూరి ప్రకాశ్రెడ్డి పార్టీ మారేందుకు సిద్ధమైపోయారు.
ఇటీవల హైదరాబాద్ పర్యటనకు వచ్చిన కేంద్ర హోంత్రి అమిత్ షాను కలిసేందుకు రేవూరి విశ్వప్రయత్నాలు చేశారు. అరుణ్ జైట్లీ హఠాన్మరణంతో.. నగరంలోని పలు కార్యక్రమాను రద్దు చేసుకున్న షా హుటాహుటిన ఢిల్లీకి పయనమై వెళ్లిపోయారు. దీంతో ప్రకాశ్రెడ్డి ఢిల్లీ వెళ్లి అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరనున్నట్టు తెలుస్తోంది.
మరోవైపు.. తమ్ముడి మృతితో కొండా సురేఖ బీజేపీలో చేరికకు కొంత ఆలస్యమైంది. ఆమె కూడా త్వరలోనే కాషాయ కండువా కప్పుకోనున్నారట. ఏదేమైనా రేవూరి కూడా పార్టీ మారిపోతే చంద్రబాబుకు తెలంగాణలో పెద్ద దెబ్బే అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అటు కొండాతో కాంగ్రెస్కు కూడా బిగ్ షాక్ తప్పేలా లేదు.