బీజేపీ-టీఆర్ఎస్ మధ్య ఏమీ లేకపోతే అవినీతి అరిపణలపై విచారణ జరిపించాలి. బాబాసాహెబ్ అంబెడ్కర్ ప్రాణహిత - చేవెళ్లతో పదహరున్నార లక్షల ఎకరాల సాగులోకి వస్తాయన్న ఆశాభావాన్ని సిఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం తరువాత ఒక్క ఎకరాకు నీళ్లు అయిన ఇచ్చారా? అని సీయల్పీ నేత భట్టి విక్రమార్క ప్రశ్నించారు. క్షేత్ర పర్యటనలో భాగంగా టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్ రెడ్డితో పాటు పలువురు నేతలు తుమ్మిడిహట్టి ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో నేతలు మాట్లాడారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో పదహరున్నార లక్షల ఎకరాలకు సాగు నీరు, తాగు నీరు హైదరాబాద్ లోని పరిశ్రమలకు అవసరమైన నీటిని అందించేలా రూపొందించారని అన్నారు. అప్పటి కాంగ్రేస్ ప్రభుత్వం 38 వేల కోట్ల ఖర్చుతో ఈపీసీ కింద కాంట్రాక్టుకు పనులు అప్పగించారని ఆయన చెప్పారు.
ఈపీసీ కింద ప్రభుత్వం కాంట్రాక్టుకు ఇవ్వడం వలన.. ఖర్చులు పెరిగినా ప్రభుత్వానికి సంభందం లేకుండా.. ప్రాజెక్టును పూర్తి చేసి ప్రభుత్వానికి ఇచ్చే అవకాశం ఉండేదని అన్నారు. తుమ్మిడిహట్టి ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ నేతలు తెరాస ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఈ ప్రాజెక్టుకు తట్టెడు మట్టి కూడా ఎందుకు ఎత్తలేదని సీఎం కేసీఆర్ను నిలదీశారు. ప్రాజెక్టుల నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదని, ఈ అంశంలో తాము సంపూర్ణ మద్దతు ఇస్తామని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పునరుద్ఘాటించారు. ప్రజాధనం దుర్వినియోగం చేయకుండా చూడాల్సిన బాధ్యత ప్రతిపక్షంగా తమకు ఎంత ఉందో.. మీడియాకు కూడా అంతే ఉందని ఉత్తమ్ పేర్కొన్నారు. అప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ పై 10 వేల కోట్లరూపాయలు ఖర్చు చెసిందని ఆయన చెప్పారు. తెలంగాణ వచ్చి ఇప్పటికి ఆరేళ్ళు అయింది.
ఏడాదికి 10 వేల కోట్లు ఖర్చుపెట్టినా.. మూడేళ్ళలో ప్రాజెక్టు పూర్తియి.. మూడేళ్ళుగా పదహరున్నర లక్షల ఎకరాలకు నీళ్లు పారేవని అన్నారు. మొత్తం తెలంగాణలోని 80 శాతం ప్రాంతానికి తాగునీరు లభించేదని చెప్పారు. ఈపీసీ పద్ధతిలో మొదలు పెట్టిన ఈ ప్రాజెక్టు వలన కమీషన్లు రావని.. ఈ ప్రాజెక్టును చంపేసి కాళేశ్వరం చేపట్టారని అన్నారు.ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టుతో కేవలం ఒక చిన్న లిఫ్ట్ పెట్టుకుని గ్రావిటీ ద్వారా.. నీటిని దిగువకు పంపించే అవకాశం ఉండదని అన్నారు.కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న ఈ కార్యక్రమానికి నేతలు రేవంత్ రెడ్డి, జీవన్ రెడ్డి, వి.హనుమంతరావు, షబ్బీర్ అలీ, రమేష్ రాథోడ్, బలరాం నాయక్ తదితరులు హజరయ్యారు.