కేసీఆర్ ఈ దసరాకు మంత్రివర్గాన్ని విస్తరించబోతున్నట్టు తాజా సమాచారం. ఇప్పటికే ఈ విషయంపై కసరత్తు కూడా మొదలు పెట్టేశారిన టీ పాలిటిక్స్లో చర్చలు జోరందుకున్నాయి. కేసీఆర్ కేబినెట్లో ప్రస్తుతం 12 మంది మంత్రులు ఉన్నారు. మరో ఆరు బెర్తులు ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా చోటు దక్కించుకునే ఆ ఆరుగురు మంత్రులు ఎవరు ? అన్నదే ఆసక్తిగా మారింది. కేసీఆర్ తాజాగా మంత్రివర్గంలో ఉండి అతి చేస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఇద్దరు మంత్రులకు ఉద్వాసన పలుకబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.
అదే సమయంలో నలుగురు కొత్తవాళ్లకు చాన్స్ ఇస్తారని అంటున్నారు. ఇదే గనుక జరిగితే మరో నలుగురు సీనియర్లకు చాన్స్ ఉందని అంటున్నారు. ఓవరాల్గా చూస్తే తనయుడు కేటీఆర్తో పాటు అటు మేనళ్లుడు హరీష్రావుకు కేబినెట్లో చోటు దక్కడం అయితే ఖాయమైంది. ఇక మహిళా కోటాలో ఆశావాహులు ముగ్గురు, నలుగురు ఉన్నా కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో చేరిన సబితా ఇంద్రారెడ్డిని కూడా మంత్రివర్గంలోకి తీసుకుంటారని సమాచారం.
ఇద్దరు మహిళలకు చోటు ఉండదని టీఆర్ఎస్ వర్గాలే చెపుతున్నాయి. ఇక రెడ్డి కోటాలో సబితతో పాటు ఇటీవలే ఎమ్మెల్సీ అయిన గుత్తా సుఖేందర్ రెడ్డిని మంత్రిగా చేస్తారని చర్చ జరుగుతోంది. ఇక కేటీఆర్, హరీష్, సబిత, గుత్తా ఖాయంగా కాగా మరో రెండు సీట్లు.. ఇప్పుడున్న వారిలో ఇద్దరిని తొలగిస్తే మొత్తం నాలుగు మంత్రి పదవులు కొత్త వారికి వస్తాయనే చర్చ పార్టీలో సాగుతోంది.
ఎవరి అంచనాలు ఎలా ఉన్నా కేబినెట్ నుంచి బయటకు వెళ్లే వారి విషయంలో కేసీఆర్ ఎవరికి షాక్ ఇస్తారో ? అంతు పట్టడం లేదు. కొందరు అనూహ్యంగా ఈటెల రాజేందర్ను పక్కన పెట్టేస్తారని అంటున్నారు. ఈ వార్త చాలా మందికి షాకింగ్గా మారింది. పార్టీలో ఆయన కమ్యూనల్గా డామినేట్ చేస్తున్నారని... అందుకే కేసీఆర్ ఆయన్ను పక్కన పెట్టాలని డిసైడ్ అయినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇక నిజామాబాద్ జిల్లాకు చెందిన వేముల ప్రశాంత్రెడ్డి విషయంలో కూడా కేసీఆర్ గుర్రుగా ఉన్నారంటున్నారు. ఇక కమ్మ సామాజికవర్గానికి ఓ మంత్రి పదవి ఇవ్వాలని భావిస్తే ఆ రేసులో మాజీ మంత్రి తుమ్మలతో పాటు పువ్వాడ అజయ్కుమార్, ఆరికెపూడి గాంధీ రేసులో ఉన్నారు. ఏదేమైనా కేసీఆర్ షాకులు తప్పవని భావిస్తోన్న వారు లోపల ఆందోళనతో ఉన్నట్టు తెలుస్తోంది.