ప్రేమోన్మాది చేతిలో అమాయకురాలైన ఒక యువతి బలైంది. ప్రేమించిన యువకుడే ఆ అమ్మాయిని దారుణంగా హత్య చేసాడు. ఖమ్మం జిల్లాలోని పెనుబల్లి మండలంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పెనుబల్లి మండలానికి చెందిన తేజస్విని (20) ఒక ఇంజనీరింగ్ కళాశాలలో పాలిటెక్నిక్ చదివింది. సత్తుపల్లి ప్రాంతానికి చెందిన నితిన్ కూడా అదే కళాశాలలో పాలిటెక్నిక్ చదివాడు. చదువుకునే సమయంలో వీరిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నారు. 
 
పాలిటెక్నిక్ లో కొన్ని సబ్జెక్టులు ఫెయిల్ కావటంతో తేజస్విని ప్రస్తుతం ఇంటి దగ్గరే ఉంది. నితిన్ మాత్రం ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో ప్రస్తుతం బీటెక్ చదువుతున్నాడు. ఆదివారం సాయంత్రం నితిన్ బైక్ పై తేజస్వినిని ఇంటి దగ్గరనుండి తీసుకొనివెళ్ళాడు. తేజస్విని ఇంట్లో కనపడకపోవటంతో తేజస్విని తల్లిదండ్రులు తేజస్విని కోసం వెతికారు. ఎంత వెతికినా ప్రయోజనం లేకపోవటంతో చివరకు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. 
 
నిన్న వీఎమ్ బంజర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదు కావటంతో పోలీసులు రంగంలోకి దిగారు. పోలీసులు తేజస్విని కాల్ డేటాను సేకరించటంతో అందులో నితిన్ నెంబర్ పోలీసులు గుర్తించారు. నితిన్ ను సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఖమ్మం జిల్లాలోని ఒక హాస్టల్లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈరోజు ఉదయం పోలీసులు నితిన్ ను అదుపులోకి తీసుకొని విచారించారు. 
 
పోలీసుల విచారణలో నితిన్ తేజస్వినిని చేతి రుమాలు ఉపయోగించి హత్య చేసానని తెలిపాడు. ఆదివారం రోజు సాయంత్రం తేజస్వినిని గుట్టపైకి తీసుకెళ్ళిన నితిన్ చేతి రుమాలును గొంతుకు బిగించి ప్రాణాలు తీసినట్లు విచారణలో తేలింది. నితిన్ చెప్పిన వివరాల ద్వారా ఘటనా స్థలానికి వెళ్ళిన పోలీసులకు మృతదేహం లభ్యమైంది. కూతురి మృతితో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. సత్తుపల్లి సీఐ సురేష్, కల్లూరు ఏసీపీ వెంకటేశ్ ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు సంబంధింధించిన కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. 
 



మరింత సమాచారం తెలుసుకోండి: