మొన్నటి ఎన్నికల్లో
ఎదురైన ఘోర పరాజయం దెబ్బకు చంద్రబాబునాయుడు తేరుకోలేకపోతున్నారు. గడచిన మూడున్నర దశాబ్దాల్లో ఎప్పుడు లేనివిధంగా ఘోర
ఫలితాలు మూటకట్టుకుంది. దాని దెబ్బకు పార్టీలోని నేతలందరికీ చంద్రబాబు నాయకత్వం
మీద విశ్వాసం పూర్తిగా పోయింది. భవిష్యత్తులో పార్టీ కోలుకుంటుందనే నమ్మకం కూడా
ఎక్కడా కనబడటం లేదు.
సరే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో జరిగిందేదో జరిగిపోయింది అని సరిపెట్టుకుందామని నేతలకు సాధ్యం కావటం లేదు. ఎందుకంటే సమీప భవిష్యత్తులో స్ధానిక ఎన్నికలు జరగబోతున్నాయి. మొన్నటి సాధారణ ఎన్నికల్లో తగిలిన దెబ్బకు రానున్న ఎన్నికల్లో టిడిపి తేరుకుంటుందనే నమ్మకం ఎవరిలోను కనబడటం లేదు.
సర్పంచ్, ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికలతో పాటు మున్సిపల్ ఎన్నికలు కూడా వరుసగా జరుగనున్నాయి. మొన్నటి దెబ్బనే రేపటి ఎన్నికల్లో కూడా తగలదని గ్యారెంటీ ఏమీ లేదు. ఎందుకంటే స్ధానిక ఎన్నికల్లో పోటి చేయటానికి టిడిపి నుండి గట్టి అభ్యర్ధులు ఎవరూ ముందుకు రావటం లేదు. గెలుపుపై నమ్మకం లేకే పోటికి వెనకాడుతున్నారని సమాచారం.
అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి పరిపాలనా విషయాల్లో జగన్మోహన్ రెడ్డి మంచి దూకుడు మీదున్నారు. మ్యానిఫెస్టోలో కానీ పాదయాత్రలో కాని వివిధ సామాజికవర్గాలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే విషయంలో జగన్ దూకుడు ప్రదర్శిస్తున్నారు. తన హామీల అమలు కోసం అనేక చట్టాలను రూపొందించారు. హామీల అమలుకు ప్రత్యేకంగా అధికారులను ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి మొన్నటి ఎన్నికలకన్నా రేపు జరగబోయే ఎన్నికల్లో వైసిసి నేతలు రెచ్చిపోయి పనిచేసే అవకాశాలున్నాయి.
అందులోను జరగబోయే ఎన్నికల్లో టిక్కెట్లను అత్యధిక శాతం పార్టీ కోసం కష్టపడిన వారికే ఇవ్వాలని జగన్ ఇప్పటికే మంత్రులు, ఎంఎల్ఏలు, ఎంపిలకు ఆదేశాలిచ్చారు. కాబట్టి పార్టీ యంత్రాంగం మొత్తం అభ్యర్ధుల విజయానికి కృషి చేస్తారు. ఈ కారణంతోనే టిడిపి నేతలు పోటికి వెనకాడుతున్నారు. చూద్దాం ఎన్నికలంటూ వస్తే పరిస్ధితులు ఎలాగుంటాయో ? అదే గనుక జరిగితే తర్వాత టిడిపి పరిస్ధితేంటో చూడాల్సిందే ?