ఆ లేఖను పరిశీలించిన సీఎం కేసీఆర్ తరలింపు పై తగిన చర్యలు తీసుకోవాలని సీఎస్ జోషిని ఆదేశించినట్లు సమాచారం. రాజధానికి చారిత్రిక చిహ్నంగా మూసీ ఒడ్డున ఉన్న హైకోర్ట్ వందేళ్ల ఉత్సవాన్ని కూడా ఇటీవలే పూర్తి చేసుకుంది. దాదాపు తొమ్మిది ఎకరాల్లో హై కోర్టు విస్తరించి ఉంది. అయితే భవనాలు బాగా పాతవి కావడంతో పాటు నగర విస్తరణతో ట్రాఫిక్ ఇబ్బందులు కూడా పెరిగాయి. ప్రస్తుత హైకోర్టు భవనంలో రెండు సార్లు అగ్ని ప్రమాదాలు జరిగాయి. ఈ నేపథ్యం ఇక్కడి నుంచి న్యాయస్థానాన్ని తరలించాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది.
హై కోర్టు కోసం ప్రభుత్వం బుద్వేల్ లో గతంలోనే వంద ఎకరాలను ఇస్తామంది. అందులో ప్రస్తుతం డెబ్బై ఎకరాల భూమి ఖాళీగానే వుంది. హైకోర్టుకు ఇవ్వటానికి ప్రభుత్వం ముందుకొచ్చింది. అక్కడే న్యాయమూర్తుల గృహ సముదాయానికి కూడా స్థలం కేటాయించడానికి సంసిద్ధత తెలిపింది. బార్ అసోసియేషన్ కు కూడా భూమి ఇవ్వడానికి సానుకూలంగా ఉంది. అవుటర్ రింగు రోడ్డుకు దగ్గరగా ఉండడం విశాలమైన భవనాలు రానుండడంతో కొందరు సీనియర్ న్యాయవాదులు కూడా హై కోర్టు తరలింపు పై సుముఖత తెలిపినట్టు సమాచారం. ఈ విషయమై త్వరలోనే బార్ కౌన్సిల్ లో కూడా చర్చించనున్నట్లు తెలుస్తుంది. చాలా మంది న్యాయవాదులు హైకోర్టు తరలింపును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
హైకోర్టు పరిరక్షణ సమితిగా ఏర్పాటవుతున్నారు. ఇందులో భాగంగా బుధవారం భోజన విరామ సమయంలో న్యాయవాదులు హై కోర్టు ముందు నినాదాలు చేశారు. వందేళ్ల చరిత్ర కలిగిన హై కోర్టు భవనాన్ని బుద్వేలుకు తరలించవద్దని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తరలించాలని చూస్తే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని న్యాయవాదులు హెచ్చరించారు. హైకోర్టును ప్రస్తుత భవనంలోనే కొనసాగించాలని విజ్ఞప్తి చేస్తూ న్యాయవాదుల సంఘాల ప్రతి నిధులు బార్ కౌన్సిల్ చైర్మన్ ఎ నరసింహా రెడ్డి కి, హై కోర్టు న్యాయవాదుల సంఘం చైర్మన్ సూర్య కిరణ్ రెడ్డి కి, బుధవారం వినతి పత్రం అందజేశారు.