చంద్రబాబు మరో విఫలయత్నానికి సిద్ధమయ్యారా? అంటే అవుననే అనిపిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ పరిస్తితి ఎలా ఉందో అందరికీ తెలుసు. తాజా ఎన్నికల్లో ఏపీలో టీడీపీకి చావుదెబ్బ తగిలింది. కేవలం 23 సీట్లకే పరిమితమైంది. అయినా కానీ ఏపీలో టీడీపీ పునాదులు గట్టిగా ఉన్నాయి. ఆ పార్టీకి నాయకులు కూడా గట్టిగానే ఉన్నారు. మళ్ళీ పోరాడితే వచ్చే ఎన్నికలనాటికి బలపడి అధికారం దక్కించుకునే అవకాశం ఉంది. కానీ తెలంగాణలో మాత్రం తెలుగుదేశం దాదాపు చచ్చిపోయిందనే చెప్పాలి. 2014 నుంచి ఆ పార్టీ పతనావస్థకు చేరుకుంటూ వచ్చింది.


2014లో 15 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ గెలుచుకున్న టీడీపీ 2019లో ఇద్దరు ఎమ్మెల్యేలకి పరిమితమైంది. ఇక లోక్ సభ ఎన్నికల్లో తొలిసారి పోటీకి దూరమైంది. అయితే టీడీపీ పెద్ద పెద్ద నాయకులతో పాటు గ్రామ స్థాయిలో సైతం నాయకులని కోల్పోయింది. ఇందులో చాలమందిని టీఆర్ఎస్ లోకి వెళ్లిపోగా, కొందరు కాంగ్రెస్ లోకి వెళ్లారు. ఇక మిగిలిన కొందరు తాజాగా బీజేపీలో చేరిపోయారు. చివరగా మిగిలిన నేతలు కూడా పార్టీ మారిపోవాలని చూస్తున్నారు.


మొత్తం మీద చూసుకుంటే టీడీపీ కనుమరగయ్యే స్థితికి వచ్చేసింది. ఇలాంటి సమయంలో చంద్రబాబు చేస్తున్న ప్రకటనలు వింతగా అనిపిస్తున్నాయి. తాజాగా ఖమ్మం జిల్లా కొత్తగూడెం, అశ్వరావుపేట కార్యకర్తలతో బాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారితో మాట్లాడిన చంద్రబాబు... తెలంగాణలో పార్టీని మళ్లీ గాడిలో పెట్టాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. ఇకపై తెలంగాణ మీద దృష్టి పెడతానని, కార్యకర్తల నుంచే నాయకులని తయారు చేస్తానని, మళ్ళీ పార్టీ పుంజుకునేలా చేస్తానని భారీ ప్రకటనలు చేశారు. ఇది పార్టీ నేత‌ల‌కే పిచ్చ కామెడీగా అనిపిస్తోంది.


ఇక పార్టీ తెలంగాణలో చచ్చిపోయింది అనుకునే సమయంలో చంద్రబాబు ఇలాంటి మాటలు చెప్పడం విడ్డూరంగా అనిపిస్తున్నాయి. ఒకవైపు ఏపీలో చావు బ్రతుకుల మధ్య కొట్టమిట్టాడుతున్న పార్టీని బలోపేతం చేసే ఆలోచనలు చేయకుండా చచ్చిపోయిన చోట విఫలయత్నాలు చేయడానికి చూస్తున్నారు. బాబు ఎన్ని విఫలయత్నాలు చేసిన తెలంగాణలో పార్టీ బ్రతికి బట్టకట్టలేదు. పైగా ఈయన స్కెచ్ ల వల్ల ఏపీలో కూడా పార్టీ నష్టం చేకూరే అవకాశం ఉంది. చూడాలి మరి రానున్న రోజుల్లో బాబు ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్ళతారో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: