బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పాలనా విషయంలో వైవిధ్యంగా ముందుకు వెళ్తున్నారు. గతంలో బీహార్ అంటే బాబోయ్ అనేవాళ్ళు. అక్కడకు వెళ్తే తిరిగి వస్తామని గ్యారెంటీ లేదు. ఒకవేళ ఏదైనా పనిచేసుకొని డబ్బులు సంపాదిస్తే.. ఆ డబ్బులకు గ్యారెంటీ ఉండదు. ఎటు నుంచి ఎవరు వచ్చి దోచుకుపోతారో తెలియదు. అందుకే ఇంతకు ముందు బీహార్ వైపు చూసేందుకు పెద్దగా ఆసక్తి చూపేవారు కాదు.
అయితే, ఇటీవల కాలంలో ఇది పూర్తిగా మారిపోయింది. నితీష్ కుమార్ అధికారంలోకి వచ్చిన తరువాత రూల్స్ ను మార్చేశారు. చాలా వరకు ఇప్పుడు ఆ రాష్ట్రం అభివృద్ధి పధంలో నడుస్తున్నది. కేంద్రం నుంచి సపోర్ట్ దొరకడంతో మార్పులు చేస్తున్నారు. గ్రామాల్లో వెలుగులు పూయిస్తున్నారు. రోడ్లు వేయిస్తున్నారు. కొత్తకొత్త పధకాలు ప్రవేశపెట్టి యువతకు మంచి మార్గంలో నడిపిస్తున్నారు.
ఒకప్పుడు బీహార్ గురించి సినిమాల్లో చూపిస్తుండేవారు. ఎవరినైనా వేయాలంటే బీహార్ నుంచి వచ్చి వేసి వెళ్ళిపోతారు.. ఇలాంటి డైలుగులు సినిమాల్లో చాలా విన్నాం. ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండేందుకు నితీష్ ప్రభుత్వం మార్గదర్శకాలను రూపొందిస్తోంది. పాలనా విషయంలోకూడా కొన్ని కట్టుబాట్లను తీసుకొస్తున్నది.
సెక్రటేరియట్ లో పనిచేసే ఉద్యోగుల విషయంలో కొన్ని మార్పులను తీసుకొచ్చింది. సెక్రటేరియట్ కు వచ్చే ఉద్యోగులు టి షర్ట్, జీన్స్ ధరించి ఆఫీస్ లకు వస్తున్నారు. ఈ సంస్కృతిని మార్చాలని నితీష్ నిర్ణయం తీసుకున్నారు. దానికి తగిన విధంగా ప్లాన్స్ రెడీ చేసుకున్నారు. ఇకపై సచివాలయ ఉద్యోగులు తగిన విధంగా డ్రెస్ చేసుకోవాలి. లైట్ కలర్ డ్రెస్ లలో ఫార్మల్ డ్రెస్ లలో రావాలి. జీన్స్, టీ షర్ట్స్ నిషేధం అని ఆర్డర్స్ ను పాస్ చేశారు. నితీష్ నిర్ణయం ఇప్పుడు అక్కడ చర్చనీయాంశంగా మారింది. సచివాలయంలో ఇది సక్సెస్ అయితే దీన్ని ఇతర కార్యాలయాలకు కూడా అనుసంధానం చేస్తారేమో..