కేంద్ర ప్ర‌భుత్వం మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. గతంలో ఎస్ బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడాలో చిన్న చిన్న బ్యాంకులను విలీనం చేసిన కేంద్రప్రభుత్వం ఇప్పుడు మరో 10 బ్యాంకులను విలీనం చేసి..4 అతిపెద్ద బ్యాంకులను ఏర్పాటు చేయనుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ తాజాగా ఈ సంచ‌ల‌న వివ‌రాలు వెల్ల‌డించారు.  తాజా ప్రకటనతో దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య 27 నుంచి 12కు తగ్గనున్నట్లు తెలిపారు. విలీనాల తర్వాత దేశంలో అతిపెద్ద బ్యాంకుగా ఎస్ బీఐ, రెండో అతిపెద్ద బ్యాంకుగా పీఎన్ బీ అవతరించనున్నాయని తెలిపారు.


పీఎన్‌బీ, ఓబీసీ, యునైటెడ్‌ బ్యాంకులు విలీనం కానున్నాయని కేంద్ర మంత్రి తెలిపారు. ఈ 3 బ్యాంకుల కలయికతో రెండో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఏర్పడుతుందని నిర్మలాసీతారామన్‌ మీడియా సమావేశంలో చెప్పారు. ఈ బ్యాంకు రూ.17.95 లక్షల కోట్లతో ఆర్థిక కార్యకలాపాలు నిర్వహిస్తుందని తెలిపారు. ఆంధ్రాబ్యాంకు, కార్పొరేషన్‌ బ్యాంకు, యూబీఐ ఒకే బ్యాంకుగా ఏర్పడనున్నాయని నిర్మలాసీతారామన్‌ తెలిపారు. సిండికేట్‌ బ్యాంకులో కెనరా బ్యాంకు విలీనం కానున్నట్లు చెప్పారు. అలహాబాద్‌ బ్యాంకులో ఇండియన్‌ బ్యాంకు విలీనం అవుతుందని..వీటి కలయిక ద్వారా ఐదో అతిపెద్ద బ్యాంకుగా మారుతుందని పేర్కొన్నారు.


సుపరిపాలన దిశగా బ్యాంకులు తమ సేవల్లో మార్పులు చేసుకోవాలని కేంద్ర మంత్రి నిర్దేశించారు. గృహ, వాహనాల, తనఖా రుణాలను 8 ప్రభుత్వ బ్యాంకులు ప్రారంభించాయి. రుణాల రికవరీలో బ్యాంకులు పురోగతి సాధించాయి. భారీ రుణాలు, మొండిబకాయిలపై పర్యవేక్షణకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశామని నిర్మలాసీతారామన్‌ వెల్లడించారు. 14 ప్రభుత్వ రంగ బ్యాంకులు లాభాలబాటలో పయనిస్తున్నాయి. ఎన్‌బీఎఫ్‌సీలకు ఇస్తున్న మద్దతును పొడిగిస్తామని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న జీఎస్టీ రీఫండ్స్‌ను రానున్న 30 రోజుల్లో క్లియర్‌ చేయాలని, భవిష్యత్తులో 60 రోజుల్లో రీఫండ్స్‌ను విడుదల చేయాలని అధికారులకు సూచించినట్లు చెప్పారు. పరిశ్రమలకు ఊతమిచ్చేలా కేంద్రప్రభుత్వం త్వరలో రెండు కీలక నిర్ణయాలు తీసుకోనుందని చెప్పారు. 5 ట్రిలియన్‌ కోట్ల ఆర్థిక వ్యవస్థ దిశగా అనేక చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: