రాజకీయాలు రోజురోజుకు  మరీ దిగజారిపోతున్నాయి. తాజాగా వైసిపి ఎంపి విజయసాయిరెడ్డి ట్విట్టర్లో చేసిన కామెంట్లే దానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. తెలుగుదేశంపార్టీ నేతలను విజయసాయి కుక్కలతో పోల్చారు.  తాజాగా చంద్రబాబునాయుడు, నారా లోకేష్ గురించి విజయసాయి మాట్లాడుతూ, ఇంట్లో కట్టేసిన పెంపుడు కుక్కలన్నింటినీ గొలుసులు విప్పి వదిలేశారు తండ్రి, కొడుకులు అంటూ వ్యాఖ్యానించారు.

 

వాళ్ళు వదిలేసిన పెంపుడు కుక్కలు దారిన వెళ్ళే వారి వెంటపడుతున్నాయట. ఈయన ఉస్కో అంటే మొరగటం ఒకటే తెలుసు వాటికి అంటూ వెటకారంగా కామెంట్ చేశారు. మొరిగే కుక్కలను తరిమికొట్టిన తర్వాత తమకు బడిత పూజేనని మర్చిపోయినట్లున్నారు అంటూ ఎద్దేవా చేశారు.

 

మొత్తం మీద  విజయసాయి చేసిన తాజా కామెంట్లు రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఎంపి తాజా వ్యాఖ్యలు రాజకీయాలు ఏ స్ధాయికి దిగజారిపోయాయో అర్ధమైపోతోంది. ఇపుడు టిడిపి నేతలపై విజయసాయి కామెంట్లు చేసిన విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.  ఇపుడు విజయసాయి కామెంట్ చేశారు కాబట్టి టిడిపి వైపు నుండి కూడా ఇంతకన్నా దారుణమైన కామెంట్లే ఉంటాయనటంలో సందేహం లేదు.

 

అసలే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై చంద్రబాబునాయుడుతో సహా మొత్తం నేతలంతా మండిపోతున్నారు. మొన్నటి ఎన్నికల్లో జగన్ కొట్టిన చావుదెబ్బ నుండి టిడిపి నేతలెవరూ ఇంకా కోలుకోలేదన్న విషయం అర్ధమైపోతోంది. అందుకే జగన్ సిఎం అయిన మూడు నెలలకే నోటికొచ్చినట్లు ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారు. ఏ చిన్న అవకాశం దొరికినా జగన్ పై బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారు.

 

అయితే ఇక్కడ చంద్రబాబైనా ఇతర నేతలైనా మరచిపోయిన విషయం ఒకటుంది. జగన్ ప్రభుత్వంపై చంద్రబాబు, నారా లోకేష్, టిడిపి నేతల్లో మాత్రమే వ్యతిరేకత కనిపిస్తోంది. వీళ్ళ వ్యతిరేకతనే ఎల్లోమీడియా కూడా గ్లోరిఫై చేసి చూపిస్తోంది. జనాల్లో జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత రానంత వరకూ వంద చంద్రబాబులు వచ్చినా చేయగలిగేది ఏమీ లేదన్న విషయం అందరికీ తెలిసిందే. అదే సమయంలో జగన్ ఏమో ఇచ్చిన హామీలను నెరవేర్చేదిశగా పాలన చేస్తున్నారు. కాబట్టి ఈ విషయాన్ని చంద్రబాబు అండ్ కో గుర్తుంచుకుంటే బాగుంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: