అయితే ప్రస్తుతం లోకేష్ అనుసరిస్తున్న వైఖరిపై చాలా మంది నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మాజీ సీఎం కుమారుడిగా యువనేతగా లోకేశ్ మరింత దూకుడుగా ఉండాలని వారు కోరుకుంటున్నారు. ముఖ్యంగా ప్రజా సమస్యలపై పార్టీ నేతలతో కలిసి లోకేష్ ఉద్యమించాలని నేతలు ఆశిస్తున్నారు. అధికారంలో ఉన్న సమయంలో చేసిన తప్పులను తెలుసుకొని పార్టీ ఏంటి లాయల్ గా ఉండే నేతలు ఎవరు, వారి అవసరాలు ఏంటీ వంటి అంశాల పై లోతుగా వెళ్లాలని పార్టీ నేతలు కోరుకుంటున్నారు. రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓటమి తర్వాత టిడిపి శ్రేణులు తీవ్ర నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోయాయి. కేవలం ఇరవై మూడు సీట్లు మాత్రమే రావడంతో పార్టీ అగ్రనాయకులు నుంచి కింది స్థాయి క్యాడర్ వరకు అందరిలో నైరాశ్యం కనిపిస్తోంది.
దీంతో పార్టీలో ఉత్సాహం నింపేందుకు ఫలితాలు వచ్చిన వారం నుంచే చంద్రబాబు పని మొదలు పెట్టారు. నేతలతో భేటీలు సమావేశాలు చర్చలతో పార్టీ యాక్టివిటీస్ వైపు నేతలను నడిపించారు. అదే సమయంలో లోకేష్ కూడా యాక్టివ్ కావాలని నేతలు కోరుకుంటున్నారు. గతంలో మంత్రిగా ఉన్న సమయంలో లోకేష్ పక్కన ఉన్న బ్యాచ్ ఇప్పుడు లేదు. ఈ విషయంలో పార్టీ శ్రేణులు ఆశించిన మార్పు కొంత కనిపిస్తుంది. అలాగే లోకేష్ ఇప్పుడు పూర్తిగా నేతలతో కార్యకర్తలతో కలవాలని వారు కోరుకుంటున్నారు. అయితే లోకేష్ గదిలో కూర్చుని ట్వీట్లు చేయడం పై పార్టీ నేతలు తీవ్ర అసంతృప్తి ఉంది. ఈ విషయాన్ని అధినేతకు గానీ, లోకేశ్ కు గానీ ఎవరూ చెప్పే ధైర్యం చేయడం లేదు. ఆ క్రమంలో పార్టీలో నెంబర్ టూ గా అంతా భావించే యనమల ఈ విషయంలో రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది.
ఎన్నికల్లో ఓడిపోవడం నష్టమే అయినా లీడర్ గా ఏమరచి కావడానికి ఇదే మంచి సమయమని దాన్ని సద్వినియోగం చేసుకోవాలని కాస్త గట్టిగానే చెప్పినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ప్రజా సమస్యలపై గ్రౌండ్ లెవల్ కి వెళ్లి పనిచేయటం మొదలుపెట్టాలనీ యనమల సూచించారట. తమ తరం ఇప్పుడు రిటైడ్ అయ్యే పరిస్థితిలో ఉందని యంగ్ టీమ్ ను లీడ్ చేసే స్థాయికి ఎదిగేలా కార్యక్రమాలు ఉండాలని పెద్దాయన చినబాబుకు సూచించారని సమాచారం. పార్టీలో ఆర్థిక వ్యవహారాలు, ఖర్చుల విషయాన్ని లోకేష్ వదిలెయ్యాలని కూడా యనమల చెప్పినట్లు తెలుస్తోంది. పార్టీ పరంగా వివిధ ఖర్చుల విషయంలో లోకేశ్ కాస్త ఫోకస్ తో ఉంటారు అనే ప్రచారం ఉన్న నేపథ్యంలో దానిని ఎత్తిచూపుతూ ఆర్థిక విషయాలను పక్కన పడేసి రాజకీయ అంశాల పై దృష్టి పెట్టాలని మాజీ మంత్రి యనమల సూచించారట.
చంద్రబాబుకు యనమల అత్యంత సన్నిహితుడు కావడం అధికారంలో ఉన్నా లేకున్నా యనమల మాటకు బాబు అత్యంత విలువ ఇవ్వడం తెలిసిందే. దీంతో యనమల చెప్పిన అంశాలు శ్రద్ధగా విన్న లోకేష్ పని తీరు మెరుగు పరచుకుంటానని చెప్పినట్లు సమాచారం. సాధారణంగా ఇతరుల విషయాల్లో బహిరంగంగా జోక్యం చేసుకుని యనమల రామకృష్ణుడు లోకేష్ విషయంలో మాత్రం కొంత ఎక్కువ చొరవ తీసుకుని పాఠాలు చెప్పినట్లు పార్టీలో చర్చ జరుగుతోంది.
చాలా మంది నేతలు లోకేష్ స్టైల్ మార్చుకోవాలని కోరుకుంటున్నారు. అయితే లోకేష్ కు నేరుగా ఆ విషయం చెప్పే ప్రయత్నం ఎవరూ చేయలేదు. ఏవైనా సూచనలు చేసినా వాటిని చినబాబు ఎలా రిసీవ్ చేసుకుంటాడో అని కొందరు సీనియర్ లు తటపటాయిస్తున్నారు. దీంతో స్వయంగా యనమల రంగంలోకి దిగి చెప్పాలనుకున్న విషయాన్ని కాస్త గట్టి గానే చెప్పారని పార్టీలో అంటున్నారు. మరి నారావారి వారుసుడికి యనమల క్లాస్ ఎంత వరకు ప్లస్ అవుతుందో చూడాలి.