వైసీపీ సర్కార్ అన్ని విధాలుగా విఫలం అయిందని ఒకనాటి జగన్ సన్నిహితుడు ఘాటు విమర్శలు చేశారు. వైసీపీ పాలన అద్వాన్నంగా ఉందని ఆయన అంటున్నారు. వైసీపీకి కూల్చడమే తెలుసు తప్ప పాలన చేతకాదని ఆయన గట్టిగా విమర్శలు చేశారు. వైసీపీ నవరత్నాల్లో ఎన్ని అమలు అయ్యాయి, జనాలకు ఎన్ని చేరువ అయ్యాయని ఆయన నిలదీస్తున్నారు.
విశాఖకు చెందిన సీనియార్ పొలిటీషియన్ సబ్బం హరి జగన్ మీద తీవ్ర విమర్శలే చేసారు. ఆయన జగన్ వెంట కొన్నేళ్ళ పాటు ఉన్న మనిషే. గత ఎన్నికలకు ముందు ఆయన పార్టీ నుంచి తప్పుకుని కిరణ్ కుమార్ రెడ్డి పార్టీలో చేరారు. ఆ తరువాత ఆయన బీజేపీకి విశాఖ ఎన్నికల్లో మద్దతు ఇచ్చి విజయమ్మ ఓటమికి కారణమయ్యారు. తాజా ఎన్నికల్లో ఆయన టీడీపీలో చేరి భీమిలీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే గత మూడు నెలలుగా సైలెంట్ గా ఉంటున్న సబ్బం మళ్ళీ గొంతు సవరించుకున్నారు.
వంద రోజుల జగన్ పాలన దారుణమని సబ్బం అంటున్నారు ప్రజ వేదికను కూలగొట్టడం గొప్పతనం కాదని, దాని వల్ల ఏం సాధించారో జగన్ చెప్పగలరా అని ప్రశ్నించారు. పోలవరం లో చంద్రబాబు అవినీతి చేశారంటున్న జగన్ ఒక్కటి కూడా నిరూపించలేకపోయారని అన్నారు. రీ టెండరింగ్ కి వెళ్ళవద్దని కేంద్రం చెబుతున్న జగన్ వినకుండా ముందుకు సాగుతున్నారని ఆయన అన్నారు.
ఇది పూర్తిగా ఒంటెద్దు పోకడ తప్ప మరేమీ కాదని, కేవలం మూడు నెలల్లోనే సర్కార్ మీద జనాలకు వ్యతిరేకత వచ్చిందని ఆయన అన్నారు. మొత్తానికి జగన్ బంపర్ మెజారిటీతో గెలవడంతో ఇన్నాళ్ళూ నోరెత్తలేకపోయిన టీడీపీ తమ్ముళ్ల గొంతులు మళ్ళీ లేస్తున్నాయి. మరి జగన్ పాలన బాగులేదా. వాళ్ల ఆలోచనలే అలా ఉన్నాయా అని వైసీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు.