మంత్రి బొత్స సత్యనారాయణ ఒక్క దెబ్బకు రెండు పిట్టలను కొట్టారు. అటు ఒక్క రాజధాని వెయ్యి కుంభకోణాలు అంటూ టీడీపీ గ్యాంగును చాకిరేవు పెడుతూనే... మరోవైపు పవన్ కల్యాణ్ డబుల్ స్టాండర్డ్స్ను ఉతికి ఆరేశారు. పనిలో పనిగా బీజేపీ వైఖరిపైనా ఘాటు విమర్శలు చేశారు.అమరావతి పరిధిలో జరిగిన అక్రమాలను గమనిస్తే... ఒక్క రాజధాని వెయ్యి కుంభకోణాలు అన్న చందంగా ఉందంటూ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజధాని పరిధిలోని ప్రతి అంశంలోనూ అవినీతి తాండవిస్తోందన్నారు.
జనసేన అధ్యక్షుడి ద్వంద వైఖరి తెలుగుదేశం అవినీతిని ప్రోత్సహిస్తున్నట్టుగా ఉందని బొత్స ఆరోపించారు. భాజపాను సైతం లక్ష్యంగా చేసుకున్న మంత్రి బొత్స.. పోలవరాన్ని తెదేపా ఏటీఎంలా వాడుకుందన్న మోదీ ఆరోపణలను గుర్తు చేశారు. రాజధాని పరిధి ప్రాంతంలో భూములు, ప్రాజెక్టులపై సమీక్ష జరిపినట్లు మున్సిపల్ శాఖామంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. రోడ్లు, టెండర్లులో గత పాలకులు దోచుకునేందుకు ప్రయత్నం చేశారని ఆయన ఆరోపించారు. తాత్కాలిక సచివాలయం పేరుతో చదరపు అడుగు10 వేలు చొప్పున ఖర్చు చేశారని... ఈ వ్యవహారం మొత్తం ఒక రాజధాని 1000 కుంభకోణాలు అన్న చందంగా ఉందని ఎద్దేవా చేశారు.
తనను విమర్శించిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పైనా మంత్రి బొత్స ఎదురుదాడి చేశారు. పవన్ కల్యాణ్ గతంలో చేసిన ప్రకటనలను గుర్తు చేసిన బొత్స... చంద్రబాబు అధికారంలో ఉండగా ఆయన్ను ప్రశ్నించలేదన్నారు. పవన్ కళ్యాణ్ తీరు తెదేపా అవినీతిని ప్రోత్సహిస్తున్నట్టు ఉందన్నారు.
పోలవరం రివర్స్ టెండరింగ్ విధానంపై భాజపా చేస్తున్న విమర్శలపైనా బొత్స స్పందించారు. ఎన్నికల ప్రచారంలో మోదీ చంద్రబాబు పై చేసిన అవినీతి ఆరోపణలను గుర్తు చేశారు. ఇప్పటికీ పవన్ పార్టీ అజెండా మారలేదన్నారు. అవినీతిని ప్రోత్సహించేలా పవన్ తీరు ఉందని విమర్శించారు. కులాల రొచ్చు లేని అమరావతి కావాలన్నది మీరు కాదా? అని ప్రశ్నించారు. అమరావతిలో కుంభకోణాలు జరిగాయని మీరే అన్నారన్నారు. రాజశేఖర్ రెడ్డి పదో వర్ధంతి రోజున సీఎం జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా విజయవాడలో కంట్రోల్ రూం ఎదురుగా ఉన్న పార్కులో వై.యస్. విగ్రహాన్ని పున: ప్రతిష్టించనున్నట్లు మంత్రి బొత్స తెలిపారు.