అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే నామినేటెడ్ పోస్టుల భర్తీకి పెద్దపీట వేస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. పార్టీ కోసం ఇంతకాలం తన వెనుక నిలిచిన నేతలను గుర్తించి మరీ పదవులు కట్టబెడుతున్నారు. ఇక, కీలకమైన తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు పాలకమండలిని కూడా త్వరలోనే ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు ఇప్పటికే జగన్ ఒక నిర్ణయానికి వచ్చారు. ఎవరెవరికి బోర్డులో స్థానం కల్పించాలనేది కూడా ఓ క్లారిటీ వచ్చారని తెలుస్తోంది.
అయితే, గతంలో టీటీడీ బోర్డులో 18 మంది సభ్యులకు మాత్రమే అవకాశం ఉండేది. ఇప్పుడు ఈ సంఖ్యను 25కు పెంచాలని జగన్ నిర్ణయించారు. దీంతో బోర్డు సభ్యుల ప్రకటన కొంత ఆలస్యం అవుతోంది. మరో రెండు మూడు రోజుల్లో బోర్డు సభ్యులను ప్రకటించే అవకాశం ఉంది. అయితే, ఎవరెవరికి టీటీడీలో అవకాశం కల్పిస్తారనే దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.
ముగ్గురు ఎమ్మెల్యేలకు బోర్డులో అవకాశం లభించనుంది. గతంలో తిరుపతి ఎంపీగా పనిచేసి, ప్రస్తుతం గూడురు ఎమ్మెల్యేగా ఉన్న వెలగపల్లి వరప్రసాదరావు, విశాఖపట్నం జిల్లా యలమంచిలి ఎమ్మెల్యే రమణమూర్తి రాజు(కన్నబాబు), కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్లు ఇప్పటికే ఖరారయ్యాయి.
ఇక, పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక రకాలుగా అండగా ఉన్న రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సతీమణి వేమిరెడ్డి ప్రశాంతికి కూడా అవకాశం ఇవ్వనున్నారని తెలుస్తోంది.
తెలంగాణ వైసీపీ నుంచి కూడా ఒకరికి అవకాశం ఇవ్వాలని జగన్ నిర్ణయించారు. వైసీపీని స్థాపించిన శివకుమార్కు ఈ అవకాశం దక్కవచ్చు. మరో నేత కొండా రాఘవరెడ్డి పేరు కూడా వినిపిస్తోంది. టీటీడీ బోర్డు సభ్యులుగా తెలంగాణ నుంచి ఎవరిని నియమించాలనేది తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి కూడా పేర్లు అడిగారట జగన్.
కేసీఆర్ ఇద్దరి పేర్లను సిఫార్సు చేశారని తెలుస్తోంది. వీరిలో ఒకరు కరీంనగర్ జిల్లాకు చెందిన కావేరి సీడ్స్ అధినేత జి.వి.భాస్కర్ రావు కాగా, మరొకరు సిద్ధిపేట నియొజకవర్గానికి చెందిన నేత అని చెబుతున్నారు.
బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా నుంచి కూడా పేర్లను అడిగారు జగన్. ఇటీవల జగన్ ఢిల్లీ వెళ్లినప్పుడు అమిత్ షా తమిళనాడుకు చెందిన ఒక విశ్రాంత అధికారిని సిఫార్సు చేశారని తెలుస్తోంది. ఆయన గత బోర్డులోనూ సభ్యుడిగా ఉన్నారని, మళ్లీ ఆయనను కొనసాగించాలని అమిత్ షా చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. వీరితో పాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా ఒకరొకరికి టీటీడీ బోర్డులో అవకాశం కల్పించనున్నారు.