విశాఖ జిల్లాలో టీడీపీ యువనేత, మాజీ మంత్రి నారా లోకేష్ పర్యటనలో ఉండగానే ఆ పార్టీకి అదిరిపోయే షాక్ తగిలింది. ఏపీలో ఎన్నికల ఫలితాలు వచ్చిన మూడు నెలలకే టీడీపీ పరిస్థితి తీవ్రమైన గందరగోళంలో పడిపోయింది. ఆ పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలోకి వెళ్లిపోయారు. మరి కొందరు మాజీ ఎమ్మెల్యేలు కూడా అదే బాట పడుతున్నారు. ఇదిలా ఉండగానే ఓడిపోయిన కీలక నేతలు వైసీపీలోకి వెళ్లిపోతున్నారు.
ఇప్పటికే విశాఖ జిల్లా అనకాపల్లి నుంచి టీడీపీ తరపున ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన అడారి ఆనంద్కుమార్తో పాటు ఆయన సోదరి యలమంచిలి మునిసిపల్ చైర్మన్ అడారి రమాదేవి ఇద్దరు వైసీపీ గూటికి చేరిపోయారు. ఇక తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నుంచి టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపోయిన వరుపుల రాజా సైతం ఓడిపోయారు. ఆయన కూడా వైసీపీలోకి వెళ్లే ఏర్పాట్లలో ఉన్నారు.
ఇదిలా ఉంటే బుధవారం లోకేష్ విశాఖ జిల్లా పర్యటన చేస్తున్నారు. ఈ పర్యటనలో ఉండగానే మంత్రి అయ్యన్నపాత్రుడు తనయుడు సన్యాసి పాత్రుడు టీడీపీకి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాతో తెలుగు తమ్ముళ్లు డీలా పడ్డారు. సన్యాసి పాత్రుడు నర్సీపట్నం మునిసిపల్ చైర్మన్గా పనిచేశారు. సన్యాసిపాత్రుని తో పాటు పలువురు కౌన్సెలర్లు కూడా కూడా వైసీపీలో చేరుతున్నారు.
టీడీపీ అనకాపల్లి ఎంపీ అభ్యర్థి అడారి ఆనంద్ వైఎస్సార్ సీపీ లో చేరిన షాక్ నుంచి తెరుకోకుండానే మరో షాక్ తగలడంతో విశాఖ జిల్లాలో టీడీపీ విలవిల్లాడుతోంది. మరో ట్విస్ట్ ఏంటంటే ఇటు జిల్లాలో లోకేష్ పర్యటనతో పాటు తన సోదరుడు అయిన మాజీ మంత్రి అయ్యన్న పుట్టినరోజు నాడే సోదరుడు సన్యాసిపాత్రుడు ఝులక్ ఇచ్చినట్లయ్యింది. ఇక ఉత్తరాంధ్రలో టీడీపీకి మరిన్ని షాకులు తగలడం ఖాయంగా కనిపిస్తోంది.