వైసీపీ పాలనలో ఎక్కడ చూసినా అరాచకాలే జరుగుతున్నాయని, ఆ పార్టీ కార్యకర్తలు ఆంబోతులా రాష్ట్రంపై పడి దౌర్జన్యాలు చేస్తున్నారని టిడిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. వైసీపీ బాధితుల కోసం గుంటూరులో టీడీపీ ఏర్పాటు చేసిన పునరావాస శిబిరంలో ఆయన ప్రసంగించారు. అందరూ నడిచే రోడ్డుపై గోడ కట్టడం ఎక్కడైనా చూశామా, పోలీసులను అడ్డం పెట్టుకుని ఇష్టానుసారంగా గ్రామాలలోని టీడీపీ కార్యకర్తలను ఖాళీ చేయిస్తున్నారు. మీకు ధైర్యముంటే నా పైన దాడి చేయండి అని చంద్రబాబు సవాల్ విసిరారు. టిడిపి అధికారంలో ఉన్నప్పుడు ఇలా చేస్తే మీరు ఉండేవారా అని వైసీపీ నేతలను చంద్రబాబు నిలదీశారు.
వైసీపీ కార్యకర్తలను సీఎం జగన్ హద్దుల్లో పెట్టాలని టిడిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. దాడుల బాధితులంతా తిరిగి గ్రామాలకూ వచ్చేలా పోలీసులు చూడాలని మాజీ ముఖ్యమంత్రి డిమాండ్ చేశారు. ప్రధానంగా బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ లే లక్ష్యంగా దాడులు సాగుతున్నాయని ఆయన ఆరోపించారు. పోలీసుల నిస్సహాయత దారుణం అని అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో 499 అరాచకాలు, ఏడుగురు టీడీపీ కార్యకర్తలను హత్య, 22 మంది పై భౌతిక దాడులు, 47 తప్పుడు కేసులు, 62 చోట్ల ఆస్తులను ధ్వంసం, 20 సోషల్ మీడియా కేసులతో వైసిపి దారుణంగా వ్యవహరిస్తుందని చంద్రబాబు పేర్కొన్నారు.
11 మంది టిడిపి మాజీ ఎమ్మెల్యేల పై అక్రమ కేసులు పెట్టారు. మరికొందరిపై ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసులు నమోదు చేస్తున్నారు.ముఖ్యంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి కంటే జగన్ దారుణంగా ప్రవర్తిస్తున్నారని ఆయన అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత పోలీసులకు ఉంది.కానీ పోలీసులే నిస్సహాయత ప్రదర్శించటం దారుణం అని ఇలాగే కొనసాగితే పోలీసులను బాధ్యులను చేస్తూ ప్రైవేటు కేసులు పెడతామని చంద్రబాబు తెలిపారు. పోలీసులు తమ వృత్తికి న్యాయం చేయాలని కోరారు. రాజకీయ పార్టీలు అధికారంలోకి వస్తాయి పోతాయి అన్న విషయాన్ని పోలీసులు గుర్తుంచుకోవాలి.
సేవ్ డెమోక్రసీ, సేవ్ పల్నాడు పేరుతో ఇప్పటికే కార్యాచరణ రూపొందించి రెండు దఫాలుగా పోలీసు ఉన్నతాధికారులను కలిసి పల్నాడు ప్రాంతంలో జరుగుతున్న అరాచకాలపై ఫిర్యాదు చేసినా కానీ ఎటువంటి మార్పు రాలేదు. వారం రోజుల్లో పరిస్థితి మారాలి, గ్రామాలు వదిలిన వారిని వాళ్ల స్వస్థలాల్లో దించాల్సిన బాధ్యత పోలీసులపైనే ఉంది. వారం రోజుల్లో ఆ పని జరగకపోతే నేనే స్వయంగా వాహనాల్లో వెళ్లి వారిని గ్రామాలకూ చేర్చి, పరిస్థితి చక్కబడే వరకూ అక్కడే ఉంటానని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ పరిస్థితి రాకుండా ఉండేలా చూసే బాధ్యత పోలీసులదేనని చంద్రబాబు తెలిపారు. కాని పక్షంలో తొలత ఆత్మకూరు నుంచి పర్యటన ప్రారంభిస్తానని ఆయన తెలియజేశారు. వైసీపీ శ్రేణుల దాడులపై జాతీయ మానవ హక్కుల సంఘం సుప్రీం కోర్టుకైనా వెళ్తాం అంటూ చంద్రబాబు స్పష్టం చేశారు.