మనం ఆరోగ్యాన్ని సంపాదించుకోవడం కంటే అనారోగ్యాన్ని సంపాదించుకోవడానికి ఎక్కువ ఖర్చు చేస్తుంటారు. రోజులు ఎక్కువ సేపు కూర్చునే వ్యక్తికీ జబ్బులు వస్తాయి. అందులో సందేహం అవసరం లేదు. జబ్బులు వస్తే.. వచ్చిన డబ్బులు దానికోసమే ఖర్చు చేయాల్సి వస్తుంది. అయినప్పటికీ మనిషి మని పరంగా ఆలోచిస్తాడుగాని, వచ్చే జబ్బుల గురించి ఆలోచించడు.
అయితే, ఇప్పుడు మనిషి పరిస్థితి మరీ దారుణంగా మారిపోయింది. ఎలాగంటే.. మనిషి కూర్చొని పనిచేస్తూ.. కావాల్సినవి అన్ని దగ్గరికి రప్పించుకుంటున్నాడు. టెక్నాలజీ అభివృద్ధి చెందిన తరువాత మనిషి తన అలవాట్లను పూర్తిగా మార్చుకున్నాడు. అంతకు ముందు కనీసం సరదాగా బయటకు వెళ్లేవారు. ఇప్పుడు అదీలేదు.
టెక్నాలజీతో సహవాసం చేసి.. ల్యాపీతో కాపురం చేస్తున్నాడు. చివరికి బీపీ తెచ్చుకుంటూ హ్యాపీ లైఫ్ ను దూరం చేసుకుంటున్నాడు. హ్యాపీ అంటే ఎలా ఉంటుంది అని అడిగే స్టేజికి మనిషి మారిపోతున్నాడు. ఆకలేసినపుడు వండుకొని తినాల్సిన మనిషి.. అలా చేయడం వలన సమయం వృధా అవుతుందని భావించి.. ఆన్లైన్ ఆర్డర్ చేస్తున్నాడు.
పనిచేసుకుంటూనే తింటూ.. తింటూనే పనిచేస్తూ.. జీవితాన్ని పనికే అంకితం చేస్తున్నాడు. ఇలా ఉన్నచోట నుంచి కదలకుండా పనిచేయడం వలన ఎన్ని రకాల అనారోగ్యాల బారిన పడుతున్నాడో చెప్పక్కర్లేదు. జేబునిండా డబ్బులు పెట్టుకొని ఒంటినిండా జబ్బులు పెంచుకుంటే ఉపయోగం ఏముంటుంది. ఒకప్పుడు కూర్చొని తింటే కొండలైన కరుగుతాయని అనేవారు. ఇప్పుడు ఆ సామెతను కాస్త మార్చాలి.. కూర్చొని పనిచేస్తూ తింటే.. కొండలు పెరుగుతాయి.. దాంతో పాటు ఒంట్లో జబ్బులు పెరుగుతాయి. కాబట్టి కాస్త సమయాన్ని మనిషి తన శరీరం కోసం కూడా ఉపయోగిస్తే మంచిది. అందుకే ఉదయాన్నే కాసేపు కాయం కరిగించే పనులు చేయాలి.. వ్యాయామం అని తెలియని యోగం చేయాలి. అప్పుడే శరీరంలో సారం పెరుగుతుంది. రోగం దూరం అవుతుంది.