ఏపీ ప్రభుత్వం బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో పలు పథకాలకు ఆమోద ముద్ర వేసింది. ఈ క్రమంలోనే వైఎస్ఆర్ పెళ్లి కానుక పథకాన్ని శ్రీరామనవమి నుంచి అమల్లోకి వస్తుందని ఏపీ మంత్రి పేర్ని నాని ప్రకటించారు. కేబినెట్ సమావేశంలో ఆమోదించిన పలు కీలక నిర్ణయాలు మీడియాకు వెల్లడించారు.
వైఎస్ఆర్ పెళ్లి కానుక పథకానికి రూ. 750 కోట్లు కేటాయించినట్టు మంత్రి నాని తెలిపారు. ఈ క్రమంలోనే బీసీలకు పెళ్లి కానుక విషయానికి వస్తే రూ. 50 వేలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పెళ్లి కానుక కింద రూ. లక్ష ఇవ్వనున్నారు. కేటగిరిల వారిగా చూస్తే ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు రూ. లక్ష గరిష్టంగా రానుంది.
ఇక బీసీలు కులాంతర వివాహం చేసుకుంటే రూ. 70 వేలు, వికలాంగులకు రూ. లక్షా 50, భవన నిర్మాణ కార్మికులకు రూ. లక్ష రూపాయలు ఇవ్వాలని కేబినెట్ తీర్మానం చేసినట్లు వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో ఒక్కొక్కటి అమలు చేస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ పథకానికి చంద్రన్న పెళ్లి కానుక పేరు ఉండేది. ఇప్పుడు అదే పథకానికి వైసీపీ వైఎస్సార్ పెళ్లి కానుకగా పేరు మార్చింది.
పెళ్లి చేసేందుకు పేద కుటుంబాలు చాలా ఇబ్బంది పడుతున్నాయి. పెళ్లి భారంగా మారిన పేద కుటుంబాలకు అండగా ఉంటామని జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. బంగారు తాళిబొట్టు, నూతన వస్త్రాలు, భోజనాలు, పెళ్లి మండపం, పెళ్లి భజంత్రీలు అన్నింటికీ కనీసం లక్ష అవుతుందనే ఆలోచనతో.. పెళ్లి చేసుకునే వారికి అక్షరాల రూ.లక్ష ఇవ్వాలని జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఇక ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే ఈ సర్టిఫికెట్లు తప్పనిసరిగా ఉండాలి.
మీసేవా జారీ చేసిన నేటివిటి, కమ్యూనిటీ, బర్త్ సర్టిఫికేట్ - వయస్సు నిర్ధారణ కోసం 10 తరగతి లేదా ఇంటిగ్రేటెడ్ మీ-సేవా సర్టిఫికెట్ - కుల ధ్రువీకరణ పత్రం, వివాహ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ - తెల్లరేషన్ కార్డు లేదా మీ సేవ ఆదాయ ధ్రువీకరణ పత్రం - పెళ్లికూతురు బ్యాంకు ఖాతా జిరాక్స్ - దివ్యాంగులైతే అందుకు సంబంధించిన సర్టిఫికెట్ (కనీసం 40 శాతంగా ఉండి శాశ్వత అంగవైకల్యం ఉండాలి) - భవన నిర్మాణ కార్మికులైతే కార్మిక శాఖ రిజిస్ట్రేషన్ నంబర్ లేదా గుర్తింపు కార్డు ఉండాలి.