కల్వకుంట్ల కవిత.. ముఖ్యమంత్రి కేసీఆర్ కూతరుగానేకాకుండా.. తెలంగాణ జాగృతి సంస్థతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను సొంతం చేసుకున్న నాయకురాలు. 2014 ఎన్నికల్లో ఆమె టీఆర్ఎస్ నుంచి నిజామాబాద్ ఎంపీగా ఘనవిజయం సాధించి పార్లమెంటులోకి అడుగుపెట్టారు. ఆమె ఐదేళ్ల పాటు ఇటు రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా... అటు జాతీయ రాజకీయాల్లోనూ టీఆర్ఎస్లో కీలకంగా మారారు. అలాంటి కవిత గత లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ చేతిలో ఓడిపోయారు. ఇక అప్పటి నుంచి ఆమె పార్టీ కార్యక్రమాల్లో అంత చురుగ్గా పాల్గొనడం లేదు.
కవిత ఇప్పుడు మాజీ ఎంపీ అన్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఆమెకు వీరభక్తుడు అయిన ఓ టీఆర్ఎస్ ఎమ్మెల్యే మాత్రం ఆమెను బహిరంగ వేదికల మీద ఇంకా ఎంపీయే అని పిలుస్తున్నారట. మరి ఆ కథేంటో చూద్దాం. 2014 ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి కవిత పోటీ చేసి గెలిచారు. ఆమె నియోజకవర్గంలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒక్క జగిత్యాల మినహా అన్ని చోట్లా టీఆర్ఎస్ అభ్యర్థులే విజయం సాధించారు. దీంతో ఆ సెగ్మెంట్లో ఆమెకు అడ్డే లేదు.
జగిత్యాలలో కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్రెడ్డి గెలిచారు. ఐదేళ్ల పాటు ఆమె జీవన్రెడ్డిని చాలా ధీటుగా ఎదుర్కొన్నారు. జగిత్యాల జిల్లా చేయడంతో పాటు జగిత్యాల, మెట్పల్లి మునిసిపాల్టీలకు కోట్లాది నిధులు మంజూరు చేయించి జీవన్రెడ్డి ఓటమే ధ్యేయంగా పనిచేశారు. ఆ ఐదేళ్లు కవిత బహిరంగ వేదికలపై జీవన్రెడ్డి చేతిలో ఓడిన డాక్టర్ సంజయ్కుమార్ను ఎమ్మెల్యేనే అని సంబోధించేవారు. జీవన్రెడ్డి అరిచి గీపెట్టినా ఆయన్ను ఎవ్వరూ పట్టించుకోలేదు.
కట్ చేస్తే డిసెంబర్లో కవిత పట్టుబట్టి జీవన్రెడ్డిని ఓడించి.. సంజయ్ను గెలిపించారు. కవిత అంటే సంజయ్కు విపరీతమైన భక్తి ప్రదర్శించే వారు. మొత్తానికి సంజయ్ ఎమ్మెల్యే అయ్యారు. నాలుగు నెలలకే కవిత ఎంపీగా ఓడిపోయారు. దీంతో సంజయ్ సంతోషం ఎక్కువకాలం నిలవలేకపోయింది. ఐదేళ్ల పాటు తాను ఎమ్మెల్యే కాకుండానే ఎమ్మెల్యే అని కవిత పిలవడంతో ఇప్పుడు ఆమె ఎంపీ కాకపోయినా ఆమెను బహిరంగంగానే ఎంపీ కవిత అని సంబోధిస్తున్నారు. అది కవిత వీరభక్తుడైన ఎమ్మెల్యే కథ.