మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలకు వేళవుతున్న తరుణంలో అధికార బీజేపీ, దాని మిత్రపక్షం శివసేన సీట్ల పంపకాలపై దృష్టి సారించాయి. ఓవైపు ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో బీజేపీ, శివసేనలు పొత్తుల్లో భాగంగా సీట్ల పంపకాలపై దృష్టి నిలిపితే, కాంగ్రెస్ పార్టీ మాత్రం అధికార ఈవీఎంలు వద్దు బ్యాలెట్ ముద్దు అంటూ మళ్ళీ పాత పాటే అందుకుంది. అధికార పార్టీ సీట్ల పొత్తుపై కసరత్తు చేస్తుంటే, కాంగ్రెస్ మిత్రపక్షాలు ఎన్నికలపై పోరాటం అంటూ సీట్ల సర్దుబాటును పక్కన పడేశారు.
మహారాష్ట్రలో త్వరలో ఎన్నికల నగార మోగుతున్నట్లు సంకేతాలు వెలువడటంతో అధికార బీజేపీ, దాని మిత్రపక్షం శివసేన సీట్ల పంపకాలపై కసరత్తు చేస్తున్నాయి. అందులో భాగంగా మహారాష్ట్ర అసెంబ్లీలో 288 సీట్లకు గాను ఏ ఏ సీట్లలో ఏ పార్టీ పోటీ చేయాలి, అసలు బీజేపీ ఎన్ని సీట్లు, శివసేనకు ఎన్ని సీట్లు తేల్చుకునేందుకు బుధవారం బీజేపీ రాష్ట్ర చీఫ్ చంద్రకాంత్ పాటిల్ ఇంట్లో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బీజేపీ ఆర్థిక మంత్రి సుధీర్ ముంగటివర్, శివసేన మహారాష్ట్ర చీఫ్ సుభాష్ దేశాయ్లు పాల్గొని చర్చలు జరిపారు.
ఈ చర్చల్లో సిట్టింగ్లకే టికెట్లు అనే నినాదం ఎత్తుకోవడంతో, మరి ఇటీవల కాంగ్రెస్, ఎన్సీపీల నుంచి బీజేపీలో చేరిన వారి పరిస్థితి ఎంటన్నది ప్రశ్నార్ధకంగా మారింది. ఇక ఓవైపు బీజేపీ, శివసేన కూటమి పొత్తులు, సీట్ల సర్దుబాటుపై కసరత్తు చేస్తుంటే, ఇటువైపు కాంగ్రెస్, ఎన్సీపీలు మాత్రం రాష్ట్రంలో ఈవీఎంలతో కాకుండా బ్యాలెట్ పేపర్తో ఎన్నికలు జరుపాలని ఉద్యమానికి సిద్ధమయ్యాయి. ఇంతకు కాంగ్రెస్, ఎన్సీపీ ఇలా పోరాటం చేసేందుకు కారణం బీజేపీ పార్టీనే.. అధికార పార్టీ ఇటీవలే ఓ సర్వే చేయించిందట.
అందులో బీజేపీ దాని మిత్రపక్షాలు 229సీట్లు గెలుచుకుంటాయని సర్వేలో తేలిందట. దీంతో కాంగ్రెస్ కోపానికి కారణమైందట. బ్యాలెట్ ఎన్నికలు జరుపాలని, ఈవీఎంలో ఎన్నికలు వద్దని కాంగ్రెస్ నేత వడ్డెటివార్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ను సర్వే పేరుతో పక్కదారి పట్టించి బీజేపీ, శివసేన, దాని మిత్రపక్షాలు తన పని తాము చేసుకుపోతున్నాయి.