ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో మద్యపాన నిషేధం అమలు చేసిన ఘనత దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు కు దక్కితే, నవ్యంధ్ర లో మాత్రం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి దక్కుతుందన్న ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, మద్యపాన నిషేధం పూర్తి స్థాయి లో అమలు చేసిన తరువాతే ఎన్నికలకు వెళ్తామని అన్నారు . ఆంధ్రప్రదేశ్ లో మద్యపాన నిషేధానికి వైకాపా సర్కారు నడుం బిగించింది. దశల వారీగా మద్యనిషేధం అమలుకు చర్యలు తీసుకుంటుంది .
ఎన్నికలకు ముందు ఏపీలో మద్యపాన నిషేధాన్ని దశలవారీగా అమలు చేస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ దిశగా చర్యలను చేపట్టారు. కొత్త మద్యం విధానాన్ని ప్రకటించడంతో పాటు సర్కారు ద్వారానే మద్యం దుకాణాలు నిర్వహించాలని నిర్ణయించారు. అక్టోబర్ నుంచి ఏపీలో ప్రభుత్వం పూర్తిస్థాయిలో మద్యం దుకాణాలు నడపనుంది. ప్రస్తుతం మద్యం వ్యాపారాలు నిర్వహిస్తున్న దుకాణాల్లో పర్మిట్ రూమ్ లు , లూజ్ సేల్స్ విక్రయాలు కొనసాగుతుండగా , ప్రభుత్వ నిర్వహించే మద్యం దుకాణాల్లో పర్మిట్ రూమ్ లు , లూజ్ సేల్స్ ఉండే అవకాశం లేదు .
ప్రభుత్వం నిర్వహించే మద్యం దుకాణాల్లో ఎమ్మార్పీ ధరల కంటే ఎక్కువ ధరలకు మద్యం విక్రయిస్తే సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవు. పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో ఇప్పటికే ఈ విధానం అమల్లో ఉంది. ప్రభుత్వమే అక్కడ మద్యం దుకాణాలను నిర్వహిస్తోంది. అయితే ఆంధ్రప్రదేశ్ లో మద్యం దుకాణాల నిర్వహణ ద్వారా నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మద్యం దుకాణాల్లో పనిచేయడానికి సాధారణ విద్యార్హతలు, పని అనుభవం ఉన్నవారికి ఉద్యోగావకాశాలు కల్పించాలని జగన్ సర్కార్ నిర్ణయించింది . ప్రస్తుతమున్న మద్యం దుకాణాల సంఖ్యను ప్రతి ఏడాది తగ్గిస్తూ , చివరకు సంపూర్ణ మద్యపాన నిషేధమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది .