ట్రాఫిక్ ఉల్లంఘలకు పాల్పడేది ఎవరైనా వారికీ జరిమానాలు తప్పడం లేదు . అది మంత్రులైన , పోలీసు అధికారులైన, నగర మేయర్ అయినా జరిమానా విధించాలంటూ సామాన్యులు సోషల్ మీడియాను ఆశ్రయిస్తున్నారు . దాంతో విధిలేని పరిస్థితుల్లో పోలీసులు, ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడిన వారికి జరిమానాలు విధించిన సంఘటనలు పలుసార్లు చోటు చేసుకున్నాయి. తాజాగా అటువంటి ఘటనే సంగారెడ్డి జిల్లా కేంద్రం లో చోటు చేసుకుంది .   సంగారెడ్డి ప్రభుత్వ ఐటీఐ కాలేజీ సమీపంలో ఇటీవల పోలీసులు డిపార్ట్‌మెంట్ వాహనాన్ని రాంగ్ రూట్‌లో వెళ్ళింది . దీంతో అక్కడే ఉన్న ఓ వ్యక్తి ఫొటో తీసి, సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశాడు.


దీంతో ఆ ఫొటో  సోషల్ మీడియా లో  వైరల్‌గా మారింది. ట్రాఫిక్ చలాన్ల పేరుతో సామాన్యుల నడ్డి విరుస్తున్న పోలీసులు దీనికేం సమాధానం చెబుతారంటూ నెటిజన్లు ప్రశ్నించారు. పోలీసులకు కూడా ఫైన్ విధించాలని డిమాండ్ చేశారు.  చివరికి ఈ ఫొటో పోలీసుల దృష్టికి రావడంతో సెప్టెంబర్ 3న ఫైన్ విధిస్తూ ఈ చలాన్ వెబ్‌సైట్‌లో పెట్టారు. అయితే తెలంగాణలో కొత్త మోటార్ వెహికిల్ చట్టం అమల్లోకి రాకపోవడంతో రూ. 1135 చలానా విధించారు. రాంగ్ రూట్లో ప్రయాణించిన పోలీస్ వాహనం డీజీపీ పేరుతో రిజిస్టరై ఉండటంతో ఆయనకు ఫైన్ వేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ చలానాను వెంటనే చెల్లించినట్లు తెలుస్తోంది.


 దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలను నివారించడానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవలే కొత్త మోటార్ వాహన చట్టాన్ని రూపొందించిన విషయం తెలిసిందే. ఈ చట్టం ద్వారా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై విధించే జరిమానాల మొత్తాన్ని కేంద్రం భారీగా పెంచింది. అయితే, ఈ చట్టంపై వాహనదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌లో రోడ్లు దారుణంగా ఉన్నాయనీ, వాటి గురించి పట్టించుకోవడానికి ప్రభుత్వ అధికారులకు, ప్రభుత్వానికి తీరిక లేదుగానీ ఉల్లంఘనల పేరుతో భారీగా ట్రాఫిక్‌ చలానాలు పెంచుతారా..? అంటూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: