టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు ఈ మధ్య ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మీద ప్రేమ పొంగుకు వస్తోంది. మొన్నటివరకు అధికారంలో ఉండి ఎన్నో విమర్శలు చేసిన గంటా...హఠాత్తుగా ప్రతిపక్షంలోకి రావడంతో జగన్ పై ప్రేమ చూపిస్తున్నారు. ఎప్పుడు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో ఉండే గంటాకు ఈ సారి ఆ అవకాశం రాలేదు. ఎమ్మెల్యేగా గెలిచిన ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది. దీంతో అధికార పీఠం కోసం తహ తహలాడుతున్నట్లు కనిపిస్తోంది. అందుకే సీఎం జగన్ కు లేఖలు రాస్తూ ప్రేమ కురిపిస్తున్నారు.


అయితే గెలిచిన దగ్గర నుంచి సైలెంట్ గా ఉన్న గంటా పార్టీ మారిపోతారని చాలాసార్లు వార్తలు వచ్చాయి. కానీ వాటిని ఖండిస్తూ తాను పార్టీ మారేది లేదని చెబుతున్నారు. కాకపోతే జగన్ పార్టీలోకి వచ్చేవారు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రావాలని చెప్పడంతోనే గంటా ఆలోచిస్తున్నారు గానీ లేదంటే ఎప్పుడో జంప్ కొట్టేసేవారని అంతా చెప్పుకుంటున్నారు. ఇక అధికారం కోల్పోయి మూడు నెలలు పైనే కావడంతో గంటాకు చాలా ఇబ్బందిగా ఉన్నట్లుంది. అందుకే జగన్ ని దువ్వడానికి గంటా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రయత్నాలని ముందే పసిగట్టిన మంత్రి అవంతి గంటాపై ఫైర్ అవుతూ.... వైసీపీలోకి రాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నాలు కూడా చేస్తున్నారు.


ఓ వైపు అవంతి ఎంత ఫైర్ అయిన గంటా మాత్రం తన పని తాను చేసుకుపోతున్నారు. తాజాగా విశాఖ భూకుంభకోణంకు సంబంధించి గంటా జగన్ కు లేఖ రాశారు.   విశాఖ భూ కుంభకోణం విషయంలో తిరిగి సిట్ దర్యాప్తునకు ఆదేశించాలని అందులో కోరారు. అందులో ఎవరు దోషులుగా తేలితే వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని కూడా గంటా కోరడం విశేషం. ఇలా చేయడం వల్ల తాను నిజాయితీపరుడని అందరూ అనుకుంటారని గంటా భావిస్తున్నట్లు తెలుస్తోంది.


పైగా ఆ లేఖలో జగన్ వంద రోజుల పాలన పూర్తి చేసుకున్నందుకు గంటా అభినందనలు కూడా తెలియజేశారు. దీని బట్టి చూస్తే గంటాకు జగన్ పై బాగానే ప్రేమ ఉన్నట్లు అర్ధమవుతుంది. ఆ ప్రేమ కూడా పార్టీలో చేరడానికే అని తెలిసిపోతుంది. మొత్తం మీద వైసీపీలో చేరడానికి గంటా చాలా రకాల ఎత్తులే వేస్తున్నారని రాజకీయ వర్గాలు కోడై కూస్తున్నాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: