తెలుగు పుస్తకప్రదర్శన. ఇందులో పెద్ద విశేషం ఏమి లేదు కానీ బ్రిటిషు గడ్డపై తెలుగు పుస్తక ప్రదర్శన విశేషమే మరి. బ్రిటన్‌కు చెందిన నవసమాజ్ దర్పణ్ అనే స్వచ్ఛంద సంస్థ థుర్రోక్ డివిజన్ గ్రేస్ లైబ్రరీలో ఆగస్టు 24న నిర్వహించిన తెలుగు పుస్తక ప్రదర్శన విజయవంతమైంది.


బ్రిటన్‌లో తెలుగు భాషకు చెందిన పుస్తకాల ప్రదర్శన నిర్వహించడం అదే తొలిసారి కావడం గమనార్హం. సాధారణ, ఆధ్యాత్మిక, బాలలు సహా వివిధ రకాల పుస్తకాలను ప్రదర్శన లో ఉంచారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పాఠకులు ఈ ప్రదర్శనను ఆసక్తిగా తిలకించారు. పురాతన భారతీయ భాషలలో ఒకటైన తెలుగు గొప్పదనాన్ని వారికి నిర్వాహకులు తెలియచెప్పారు.


బ్రిటన్‌లో తెలుగు వారే కాకుండా బెంగాలీలు, శ్రీలంక తమిళులు, ఐర్లాండ్, బ్రిటన్ పౌరుల నుంచి కూడా మంచి స్పందన రావడం విశేషం. తెలుగేతరులకు సులభంగా అర్థమయ్యేలా నవసమాజ్ దర్పణ్ సభ్యులు పుస్తకాలను ఇంగ్లిష్‌లో కూడా అందుబాటులో ఉంచారు. బాలలకు సంబంధించిన పుస్తకాలను ఆంగ్లంలోకి అనువదించి ఉంచినట్టు వివరించారు. ఇతర పుస్తకాలను త్వరలోనే అనువదిస్తామని తెలిపారు. ఈ ప్రదర్శన తిలకించిన ఓ బ్రిటన్ పౌరుడు.. యోగా, మెడిటేషన్ క్లాసులను నిర్వహించాలని కోరినట్టు నిర్వాహకులు తెలిపారు.


అలాగే, బ్రిటన్‌లో ఉన్న తెలుగువారి పిల్లలకు వారాంతాల్లో తెలుగు భాషకు సంబంధించి పాఠాలను నేర్పించాలని నిర్ణయించారు. పుస్తకాల ద్వారా స్వచ్ఛందంగా బ్రిటన్‌లో తెలుగు భాషకు విశేష ప్రచారం కల్పించనున్నట్టు వెల్లడించారు. బ్రిటన్‌లోని తెలుగు సంతతికి చెందిన ప్రస్తుత తరానికి మాతృభాషలో చదవడం, రాయడం వచ్చేలా చేయడమే తమ లక్ష్యమని, ఇది తమకు పెద్ద సవాల్‌గా మారిందని అన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన తెలంగాణ ప్రభుత్వ సలహాదారు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ కేవీ రమణాచారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. భారత్ నుంచి అనేక పుస్తకాలను ఆయన తమకు అందజేసినట్టు పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: