ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ ( ఏపీఎస్ ఆర్టీసీ) ఈపేరు విననివారు ఉండరు.. కాదు కాదు ఈ పేరుతో నడిచే బస్సుల్లో ఎక్కి ప్రయాణం చేయని పౌరుడు ఒక్కరు ఉండకపోవచ్చు. అలాంటి ఏపీఎస్ ఆర్టీసీ ఏర్పడీ 61ఏండ్లు పూర్తి చేసుకుంది.. కానీ ఇన్నేండ్ల కాలంలో పాలకులు ఆర్టీసీని అవసరాలు తీర్చే కామధేనువుగా వాడుకున్నారే తప్ప, దాన్ని అభివృద్ధి చేద్దామని కానీ, అందులో అష్టకష్టాలు పడుతూ బతుకు బండి లాగుతున్న కార్మికుల వెతలు తీర్చిన నేతలు కానరాలేదు.. ఆర్టీసీ కార్మికుల కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులతో కునారిల్లుతున్నా కుంటి సాకులు చెప్పి నేతలు తప్పించుకున్నారే కానీ వారి బతుకులకు భరోసా ఇచ్చేవారే లేకుండా పోయారు..
ఈ 61ఏండ్ల కాలంలో అందరు పాలకులు ఆర్టీసీని పట్టించుకోకపోగా, సీనియర్ సీఎంగా చెప్పుకునే నారా చంద్రబాబు నాయుడు మాత్రం ఆర్టీసీని బ్రష్టు పట్టించాడనుటలో ఎలాంటి సందేహం లేదు. కానీ కేవలం 100 రోజులు పాలన పూర్తి చేసుకున్న వైసీపీ నేత ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి కనివిని ఎరుగని రీతిలో ఇచ్చిన మాటకు కట్టుబడి ఆర్టీసీని ప్రభుత్వ పరం చేయడమే కాకుండా, కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడంతో ఆర్టీసీ కార్మికుల కుటుంబాల్లో ఆనందం తాండవిస్తుంది. మరి ఇంతకు సీనియర్ రాజకీయ నేత చంద్రబాబుకు సాధ్యం కానిది యువ సీఎం జగన్కు ఎలా సాధ్యం అయింది.. ఓసారి లుక్కేద్దాం..
ఏపీఎస్ ఆర్టీసీ ఏర్పడక ముందు రాష్ట్రంలో నిజాం స్టేట్ రైల్ అండ్ రోడ్డు ట్రాన్స్పోర్టు డిపార్ట్మెంట్ పేరుతో బస్సులను నడిపేవారు. ఏపీఎస్ఆర్టీసీగా 11జనవరి 1958లో ప్రస్థానం ప్రారంభించింది. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు తన సేవలను కొనసాగిస్తూనే ఉంది. ఆర్టీసిని నమ్ముకుని లక్షలాది మంది కార్మికులు బతుకు బండిలాగుతున్నారు. ఏపీ, తెలంగాణగా రాష్ట్రాలుగా విడిపోయిన తరువాత జూన్ 3, 2015న ఏపీఎస్ ఆర్టీసీ నుండి టీఎస్ ఆర్టీసీగా వేరుపడింది. ఇక అప్పటి నుంచి ఏపీఎస్ ఆర్టీసీ ప్రధాన కార్యాలయంగా విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్స్టాండ్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
ఇప్పుడు ఏపీఎస్ ఆర్టీసీకి నాలుగు జోన్లతో12 రిజినల్ కేంద్రాలుగా విభజించి 126 బస్డిపోలు, 426బస్స్టేషన్లతో 8964 ప్రభుత్వ బస్సులు, 2714 ప్రైవేటు బస్సులు మొత్ం 11,678 బస్సులతో రోజుకు 44.15లక్షల కిలోమీటర్ల మేర ప్రయాణం చేస్తూ లక్షలాది మందిని తమ గమ్యస్థానాలకు చేర్చుతుంది. ఇంత చరిత్ర కలిగిన ఏపీఎస్ ఆర్టీసీలో సుమారు లక్షలాది మంది కార్మికులు నిత్యం పనిచేస్తూ ప్రయాణికుల సేవలో తరిస్తున్నారు. ఏపీఎస్ ఆర్టీసిని గిన్నిస్బుక్లో స్థానం సంపాదించి పెట్టిన కార్మికుల కడుపు నింపేవారు లేకుండా పోయారు.
చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక ఆర్టీసికి ఉన్న విలువైన ఆర్టీసీ స్థలాలను తన అనుయాయులకు మల్టీప్లెక్స్ల నిర్మాణాలకు లీజ్ పేరుతో భూపందేరం చేశాడు. ఆర్టీసి కార్మికులు తమ హక్కుల కోసం పోరాటం చేస్తే కఠినమైన చట్టాలతో వారి ఉద్యమాన్ని అణగదొక్కాడే కాని వారి కడుపు నింపే పనికి మాత్రం పూనుకోలేదు. అందుకే అధికారంలో ఉన్నంతకాలం ఒక్క హామి నెరవేర్చని చంద్రబాబు..కమీషన్లు దండుకునేందుకు ప్రైవేటు ఆపరేటర్లకు ఆర్టీసీని అప్పనంగా అప్పగించాడు చంద్రబాబు.
చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నంత కాలం ఆర్టీసీని తన పార్టీ అవసరాలకు ఎంతో ఉపయోగించుకున్నాడు... కానీ కార్మికులకు మాత్రం ఆయన చేసింది శూన్యం. అయితే వైఎస్ జగన్ ఎన్నికల హామీలో భాగంగా ఆర్టీసిని ప్రభుత్వ పరం చేస్తానని, కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని హామి ఇచ్చాడు. ఆ హామిని అమలు చేసేందుకు జగన్ సీఎం కాగానే మొదటి మంత్రివర్గ సమావేశంలోనే మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయడం, అధికారులతో ప్రత్యేక కమిటీ వేయడం జరిగింది. దీంతో మంత్రివర్గ ఉపసంఘం, అధికారుల నివేధిక ఆధారంగా ఆర్టీసీని ప్రభుత్వ పరం చేస్తున్నట్లు, కార్మికులందరిని ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చుతూ నిర్ణయం తీసుకున్నారు.
ఇలా ఎన్నో దశాబ్దాల ఆర్టీసీ కార్మికుల కలను నెరవేర్చి.. కార్మికుల కుటుంబాల్లో వెలుగులు నింపాడు జగన్. ప్రజారంజక పాలన ఎలా ఉండాలో ప్రజలకు కేవలం 100 రోజుల్లోనే చూపిస్తున్నాడు సీఎం జగన్...మాట తప్పని మడమ తిప్పని మహానేత స్వర్గీయ వైఎస్ రాజశేఖరరెడ్డి అడుగుజాడల్లో నడుస్తూ జగన్ తనదైన పరిపాలన చేస్తున్నాడని ఆర్టీసీ కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.