దొంగతనం చేయాలి అంటే ధైర్యం కావాలి. సమయస్ఫూర్తి ఉండాలి. అన్నింటికి మించి ఎక్కడ దొంగతనం చేస్తున్నారో ఆ పరిసరాలపై సరైన అవగాహన ఉండాలి. కొంతమంది నిజాయితీతో కూడిన దొంగలు ఉంటారు. వాళ్లకు కావలసిన వస్తువు తప్పించి మరే వస్తువు కనిపించినా దాన్ని ముట్టుకోరు. దీనిపై ఓ కథ కూడా ఉన్నది. నిజమైన దొంగ దొంగతనం చేయడానికి వస్తే.. ఆ ఇంట్లో వాళ్లకు తెలియకుండానే నిద్రపడుతుంది. వచ్చిన దొంగ తనకు కావాల్సిన వస్తువును మాత్రమే తీసుకొని వెళ్లిపోయేవాడు.
కానీ, ఇప్పుడు అలాకాదు. దొంగతనం చేయడానికి వచ్చిన దొంగలు.. ఇంటిని గుల్ల చేస్తుంటారు. సామానులు విసిరేస్తుంటారు. అందుకే వీరిని పట్టుకోవడానికి ఇంట్లో సీక్రెట్ గా సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. చిన్న చిన్న షాపుల్లోను ఇలాంటి ఏర్పాట్లు తప్పనిసరి అయ్యాయి. ఇటీవలే ఓ దొంగలముఠా కుషాయిగూడలో ఉన్న ఓ జ్యువెలరీ షాప్ లో దొంగతనానికి పాల్పడ్డారు.
రాత్రివేళ దొంగలు బంగారం షాపులోకి దూరి.. దొంగతనానికి పాల్పడ్డారు. షాప్ లోకి ఎంటర్ కాగానే.. సీసీ కెమెరాలు ఆన్ అయ్యాయి.. వెంటనే సిసి కెమెరాలతో అనుసంధానమైన మొబైల్ ఫోన్ యాక్టివ్ అయ్యింది. అంతే.. షాప్ యజమానికి డౌట్ వచ్చి కెమెరా ఓపెన్ చేశాడు. అందులో దొంగలు ఉన్నట్టు గుర్తించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు వస్తున్నారని తెలుసుకున్న దొంగలు.. అక్కడి నుంచి ఉడాయించారు. కొన్ని బ్యాగ్ లు అక్కడే వదిలేసి వెళ్లారు. వాళ్ళకోసం పోలీసుల గాలింపు మొదలైంది. సిసి కెమెరాల ఆధారంగా ఆ దొంగలు సికింద్రాబాద్.. దానాపూర్ రైలోని ఎస్ 9 బోగీలో ఉన్నారని తెలుసుకున్నారు. వేంటనే దానాపూర్ పోలీసులకు హైదరాబాద్ పోలీసులు సమాచారం ఇచ్చారు. హైదరాబాద్ నుంచి పోలీసులు వివిధ వాహనాల్లో ఆ ట్రైన్ ను వెంబడించారు. సికింద్రాబాద్ నుంచి దానాపూర్ స్టేషన్ కు చేరుకోగానే అక్కడి పోలీసులు ఆ భోగిలో ఉన్న నలుగురు దొంగలను పట్టుకున్నారు. హైదరాబాద్ నుంచి దానాపూర్ వరకు 1800 కిలోమీటర్లు ప్రయాణం చేసి దొంగలను పట్టుకోవడం విశేషం.