భారతదేశ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ వ్యవస్థలో అతిపెద్దదైన స్టేట్ బాంక్ ఆఫ్ ఇండియా తన ఖాతాదారులకు తీపి కబురు అందించింది. ప్రస్తుతం ఈ బ్యాంక్ రుణాలపై ఉన్న వడ్డీ రేట్లను సమీక్షించి వాటిని తగ్గించింది. అన్ని రకాల కాలపరిమితి రుణాలపై ఉన్న వడ్డీని 10 బేసిస్ పాయింట్ల మేర తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. సవరించిన ఈ రేట్లు సెప్టెంబర్ 10 నుంచి అమల్లోకి వస్తాయని ఎస్ బీఐ ఓ ప్రకటనలో తెలిపింది.

 

 

 

కొత్త రేట్ల ప్రకారం ఏడాది కాలపరిమితికి ఎంసీఎల్ఆర్ ఆధారిత రుణాలకు 8.25 శాతం ఉన్న వడ్డీరేటు ఇకనుంచి 8.15 శాతంగా ఉండనుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రుణాల రేట్లను తగ్గించడం వరుసగా ఇది అయిదో సారి. దీంతో గృహ రుణాలు బాగా తగ్గి సామాన్యులకు అందుబాటులో నిలిచాయి. ఏప్రిల్ 10 నుంచి ఇప్పటివరకూ 45 బేసిస్ పాయింట్ల వరకూ రుణాలపై వడ్డీ రేట్లు తగ్గాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రేపో రేటును తగ్గించిన నేపథ్యంలో ఎస్ బీఐ కూడా రుణ రేట్లను తగ్గించి వినియోగదారులకు ప్రయోజనం కల్పించనుంది. 

 

 

 

వీటితోపాటు ఫిక్సిడ్ డిపాజిట్లపై కూడా వడ్డీరేట్లను తగ్గిస్తున్నట్టు ఎస్ బీఐ వెల్లడించింది. అన్ని కాలపరిమితులకు రిటైల్ ఫిక్సిడ్ డిపాజిట్లపై దాదాపు 20 నుంచి 25 బేసిస్ పాయింట్లు, బల్క్ డిపాజిట్లపై 10 నుంచి 20 బేసిస్ పాయింట్లు వరకూ తగ్గించింది. సవరించిన ఈ రేట్లు కూడా రేపట్నుంచి అమల్లోకి వస్తాయి. దీంతో ఏడాది నుంచి రెండేళ్ల కాలపరిమితి డిపాజిట్లపై 6.70 శాతం ఉన్న వడ్డీరేటు 6.50 కి తగ్గింది. డిపాజిట్లపై ఎస్ బీఐ  వడ్డీరేట్లను తగ్గించడం పదిహేను రోజుల్లో ఇది రెండోసారి. చివరిగా ఆగస్టు 26న 10 నుంచి 50 బేసిస్ పాయింట్ల వరకూ వడ్డీరేట్లను తగ్గించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: