కొడుకు హితం కోరి తండ్రి చెప్పిన మాటలే ఆయనకు యమపాశాలయ్యాయి. పబ్‌జీ గేమ్‌కు బానిసైన ఆ యువకుడు  గేమ్ ఆడొద్దని చెప్పినందుకు తండ్రిపై కత్తితో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. తీవ్ర రక్తస్రావంతో తండ్రి అక్కడికక్కడే చనిపోగా ఆ శవం పక్కనే కొడుకు అర్థరాత్రి వరకూ గేమ్ ఆడుకున్నాడు. ఒళ్ళు గగుర్పిడిచే ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రంలో జరిగింది.

 

 

బెళగావి జిల్లాకు చెందిన శంకరప్ప కుంబర్గా(65) పోలీసు శాఖలో పనిచేసి రిటైర్ అయ్యాడు. శంకరప్ప కొడుకు రఘువీర్(25) ఇటీవల పబ్‌జీ గేమ్‌కు బానిసయ్యాడు. ఏ పనీ చేయకుండా నిత్యం గదిలో తలుపులు వేసుకుని గేమ్ ఆడుతూనే ఉంటున్నాడు. గమనించిన తండ్రి ఎన్నిసార్లు వారించినా కొడుకులో మార్పు రాలేదు. ఈ విషయంలో తండ్రీ కొడుకుల మధ్య అనేకసార్లు గొడవలు కూడా జరిగాయి. ఆదివారం రాత్రి పబ్‌జీ గేమ్ ఆడుతున్న రఘువీర్‌ను శంకరప్ప తీవ్రంగా మందలించాడు. పబ్‌జీ మాయలో ఉన్న రఘువీర్ తండ్రి మాటను పట్టించుకోలేదు. దీంతో కొడుకు చేతిలోని ఫోన్ లాక్కునేందుకు ప్రయత్నించాడు శంకరప్ప. కోపోద్రిక్తుడయిన రఘువీర్ తండ్రిని దూరంగా తోసేసి అక్కడే ఉన్న కత్తితో తండ్రి తల, కాళ్లపై కత్తితో దాడి చేశాడు.

 

 

సోమవారం ఉదయం ఎంతసేపటికీ శంకరప్ప బయటకు రాకపోవడంతో  స్థానికులు విచారించగా ఈ ఘోరం వెలుగు చూసింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు రఘవీర్‌ను అరెస్ట్ చేసి విచారించారు. తండ్రిని చంపేసి ఆ శవం పక్కనే తాను అర్ధరాత్రి వరకు పబ్‌జీ ఆడినట్లు నిందితుడు చెప్పడంతో పోలీసులు షాకయ్యారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవలి కాలంలో పబ్‌జీకి ఎంతోమంది యువత బానిసలుగా మారి ప్రాణాల పోగొట్టుకుంటున్నారు. ఈ గేమ్ ఎంతటి దారుణమైన పరిస్థితులకు దారితీస్తుందో చెప్పడానికి ఈ సంఘటన ఒక ఉదాహరణ.

మరింత సమాచారం తెలుసుకోండి: