పోలీసులు... రాజకీయ నాయకులకు భద్రతవరకు మాత్రమే పనికొచ్చేవారుఅనే పరిస్థితి ఇటీవల ఎన్నికల్లో తుడిచి పెట్టుకుపోయింది. సర్వీసునుంచి రిటైర్ అయిన వారు స్వచ్ఛందంగా సర్వీసును దూరం చేసుకు న్న వారు కూడా ఇటీవల ఎన్నికల్లో పోటీ చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఫైర్ బ్రాండ్ పోలీస్గా పేరు తెచ్చుకున్న గోరంట్ల మాధవ్ తన ఉద్యోగాన్ని వదులుకుని రాజకీయాల్లోకి రావడం, జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకోవడం, హిందూపురం ఎంపీ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించడం మనకు తెలిసిందే. ఇప్పుడు అచ్చు అదేవిధంగా మరో పోలీస్ అధికారి కూడా రాజకీయాల్లోకి ప్రవేశించేందుకు రెడీ అయ్యారనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.
తాజాగా ఓ పోలీసు అధికారి, అందునా మైనార్టీ వర్గానికి చెందిన సీఐ.. పొలిటికల్ సర్కిళ్లలో సంచలనం సృష్టించారు. ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర మైనారిటీ సంక్షేమ మంత్రి అంజాద్బాషాకు విశాఖలో మైనార్టీ నాయకులు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యూనిఫాంలో ఉన్న ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ వేదికపై వచ్చి.. ప్రసంగించడం సంచలనం సృష్టించింది. ఆదివారం వైసీపీ మైనారిటీ సెల్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. అతిథులు రావడానికి కొంచెం ముందు వీఆర్లో ఉన్న సర్కిల్ ఇన్స్పెక్టర్ సయ్యద్ ఇలియాస్ మహ్మ ద్ యూనిఫాంలో అక్కడకు వచ్చారు. వేదిక ఎక్కి మాట్లాడారు.
విశాఖ జిల్లాలో వక్ఫ్ బోర్డుకు 7వేల ఎకరాలు ఉన్నాయని, వాటిని కొంతమంది అన్యాక్రాంతం చేసేందుకు యత్నిస్తుంటే మతపెద్దలు పట్టించుకోవడం లేదన్నారు. మాజీ ఎమ్మెల్యే ఒకరు నక్కపల్లిలో 300 ఎకరాల వక్ఫ్ భూముల కబ్జాకు ప్రయత్నించారని ఆరోపించారు. విశాఖ ముస్లింలు ఐక్యతతో ముందుకెళ్లాలని అన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి మైనారిటీల పక్షపాతి కావడం మన అదృష్టమని పేర్కొన్నారు. ఇదే కార్యక్రమానికి ఏలూరు రేంజ్ డీఐజీ సత్తార్ఖాన్, మరో సీఐ హుస్సేన్ మఫ్టీలో హాజరయ్యారు. అయిన ప్పటికీ.. ఇలియాస్ అహ్మద్ ఎలాంటి వెరుపు లేకుండా తన వ్యాఖ్యలను సంధించారు. గతంలో ఇక్కడ ఎంపీగా చేసిన ఓ మహిళా నాయకురాలికి తాను అనేక సార్లు విన్నవించినా.. ఆమె కూడా పట్టించుకోలేదంటూ .. పరోక్షంగా పురందేశ్వరిపై విరుచుకుపడ్డారు.
దీంతో ఒక్కసారిగా రాష్ట్ర పోలీసు వర్గాల్లో ఈ విషయం సంచలనంగా మారింది. రాబోయే రోజుల్లో కాబోయే పొలిటికల్ నేత ఈయనేనా అనే చర్చ కూడా జరుగుతోంది. కొసమెరుపు ఏంటంటే.. ఉత్తరాంధ్ర నుంచి ముస్లిం నాయకుడు ఎవరూ కూడా ఏ పార్టీలోనూ ప్రాతినిధ్యం లేక పోవడం. ఇదే విషయాన్ని ఇలియాస్ కూడా ప్రస్తావించాడు. ఇక్కడ నుంచి పొలిటికల్గా ప్రాతినిధ్యం వహించే ముస్లిం నాయకుడు ఎవరూ లేరని అన్నారు. బహుశ ఈయనకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఉందేమోననే చర్చ సాగుతోంది. మరి కొన్నాళ్లు ఆగితేనే తప్ప ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం లేదు.