మాజీ మంత్రి జనసేన నాయకుడు పసుపులేటి బాలరాజు వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారనే ప్రచారం జోరందుకోవడంతో ఆయన్ను అడ్డుకోవటానికి ఆ పార్టీలో ఒక వర్గం ప్రయత్నిస్తుండగా మరో వర్గం ఆహ్వానిస్తోంది. ఆయన్ను వ్యతిరేకిస్తున్న వర్గం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఒక్క అవకాశం ఇవ్వాలని జగన్ పిలుపుతో పాడేరు నియోజకర్గాల్లో అభ్యర్థులతో సంబంధం లేకుండా అన్ని పార్టీల ప్రజలు వైసీపీకి అండగా నిలిచారు. దీంతో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన కొట్టగుళ్లి భాగ్యలక్ష్మీ ఊహించని భారీ మెజార్టీతో గెలుపొందారు. రాజకీయాలు ఆమెకు కొత్త కావడంతో మూడు నెలల పాటు పాలన సాదాసీదాగానే సాగుతోంది.




గతలో భాగ్యలక్ష్మి వ్యతిరేకించిన వైసిపి వర్గం ఆమెకు దూరంగానే వుంటోంది.నియోజకవర్గాల్లో పార్టీ బలంగా ఉన్నప్పటికీ నాయకత్వం పటిష్టంగా లేదని వైసీపీ అధిష్టానం దృష్టికి నిఘా వర్గాలు తీసుకువెళ్లినట్టు తెలిసింది. ఇదిలా ఉండగా కొంత మంది నాయకులు వ్యతిరేకిస్తున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీని వీడి జనసేనలో చేరిన బాలరాజు ఎన్నికల్లో ఘోర పరాజయం పాలయ్యారు. బాలరాజుకు వ్యక్తిగత ఓటుబ్యాంకు ఉన్నప్పటికీ జనసేనలో చేరటం వల్ల డిపాజిట్ కూడా సాధించలేకపోయారని సన్నిహితులు చెబుతున్నారు. దీంతో బాలరాజు కూడా పార్టీ మారాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది.




బాలరాజు సీనియర్ నాయకుడు కావటంతో వైసీపీలో చేర్చుకోవాలని కొంత మంది పార్టీ పెద్దలు సుముఖత వ్యక్తం చేస్తున్నట్టు తెలిసింది. మాజీ మంత్రి పార్టీలో చేరితే పాడేరు నియోజక వర్గం బాధ్యతలతో పాటు కీలకమైన నామినేటెడ్ పదవి కూడా ముఖ్యమంత్రి జగన్ అప్పగించనున్నారనే ప్రచారం జరుగుతోంది.ఇప్పటికే బాలరాజు వైసీపీలో చేరేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. తొలుత ఈ నెల ఇరవై రెండున పార్టీలో చేరాలని బాలరాజు భావించినప్పటికీ సరైన ముహూర్తం లేకపోవటంతో దసరా పండుగకు రెండు రోజుల ముందు జగన్ సమక్షంలో పార్టీలో చేరేందుకు ఏర్పాటు చేసుకున్నట్టు తెలుస్తోంది.




కాగా బాలరాజు వైసిపిలో చేరటానికి ఓ వర్గం ప్రాంతీయ నాయకులు అంగీకరించటం లేదు. పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, ఎంపీ మాధవికి కూడా కలిసొచ్చే నాయకుల్లో కలుపుకొని పోవాలని వైసిపి అధిష్టానం నుంచి ఇప్పటికే సమాచారం అందినట్టు భోగట్టా.దీంతో బాలరాజు వైసీపీలో చేరతారనే ప్రచారంపై పాడేరు ఎమ్మెల్యేగానీ, ఎంపీగానీ స్పందించటం లేదు. అయితే పాడేరు నియోజక వర్గంలోని ఐదు మండలాల ముఖ్య నాయకులు పార్టీ అధ్యక్ష కార్యదర్శులు సమావేశాలు ఏర్పాటు చేసుకుని బాలరాజు వైసీపీలో చేరితే పార్టీకి నష్టం జరుగుతుందని అతనిని పార్టీలో చేర్చుకోవద్దని ప్రకటనలు చేస్తున్నారు.




వచ్చే వారంలో చింతపల్లి మండల కేంద్రంలో ఐదు మండలాల ముఖ్య నాయకులు పార్టీ అధ్యక్ష కార్యదర్శులు బాలరాజును పార్టీలో చేర్చుకోవద్దని భారీ సభను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు తెలిసింది.అయితే నియోజక వర్గ ఐదు మండలాల్లోని ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం బాలరాజును కలిసి పార్టీలో చేరాలని మీ నాయకత్వంలో నడిచేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనప్పటికీ పాడేరు నియోజక వర్గంలో ఓ వర్గం బాలరాజును వ్యతిరేకిస్తూ ఉండగా మరో వర్గం ఆయనకు అనుకూలంగా వ్యవహరిస్తోంది. అయితే పార్టీ నాయకులు ఎవరు వ్యతిరేకించినా బాలరాజు వైసిపిలో చేరటం ఖరారైందని సన్నిహితులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: