తెలంగాణ మంత్రి వర్గ విస్తరణ అనంతరం అధికార టీఆర్ఎస్ లో అసంతృప్తి గళాలు అధికమవుతున్నాయి . ఇప్పటికే మాజీ హోం శాఖ మంత్రి నాయిని నరసింహారెడ్డి, మాజీ ఉపముఖ్యమంత్రి రాజయ్యలు మంత్రివర్గ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేయగా, ఇక తాజాగా మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కూడా అసంతృప్తితో రగిలిపోతున్న ట్లు తెలుస్తోంది.
తాజా మంత్రివర్గ విస్తరణలో తనకు ముఖ్యమంత్రి కేసీఆర్ అవకాశం కల్పిస్తారని భావించిన మైనంపల్లి హనుమంతరావు, ముఖ్యమంత్రి తన పేరును పరిగణలోకి తీసుకోకపోవడం పట్ల అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. సోమవారం నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాగా, మైనంపల్లి హనుమంతరావు వాటికి దూరంగా ఉండేందుకు బెంగుళూరు వెళ్లిపోయినట్లు సమాచారం .
టిడిపి లో కీలక నాయకుడిగా ఉన్న మైనంపల్లి హనుమంతరావు రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు . 2014 ఎన్నికల్లో మల్కాజ్ గిరి అసెంబ్లీ టికెట్ ను ఆశించిగా , టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు , ఎన్నికల పొత్తులో భాగంగా ఆ స్థానాన్ని బీజేపీ కి కేటాయించారు . దీనితో అసంతృప్తి రగిలిపోయిన మైనంపల్లి … టీఆరెస్ లో చేరి ఆ పార్టీ మల్కాజ్ గిరి లోక్ సభ అభ్యర్థిగా పోటీ చేశారు . లోక్ సభ ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయిన మైనంపల్లి కి, పార్టీ నాయకత్వం అధిక ప్రాధాన్యత ఇచ్చింది .
పార్టీ గ్రేటర్ అధ్యక్షునిగా నియమించడమే కాకుండా , ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టింది . ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే కనకారెడ్డి కాదని మైనంపల్లి కి కేసీఆర్ టికెట్ కేటాయించారు . మల్కాజ్ గిరి అసెంబ్లీ స్థానం నుంచి మైనంపల్లి మంచి మెజార్టీ తో విజయం సాధించారు . దాంతో తనకు మంత్రివర్గం లో స్థానం ఖాయమని , ఈ మేరకు కేసీఆర్ తనకు హామీ ఇచ్చారని సన్నిహితుల వద్ద మైనంపల్లి చెప్పినట్లు తెలుస్తోంది . కానీ విస్తరణ లో తనకు అవకాశం లేకపోవడం తో అసంతృప్తి తో రగిలిపోతున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు .