తెలంగాణ రాష్ట్రంలో చేనేతను ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులందరూ విధిగా వారంలో ఒక రోజు చేనేత దుస్తులను ధరించాలన్న నిబంధన విధించారు. దీని అమలు విషయంలో మంత్రి కెటిఆర్ ప్రత్యేక దృష్టిని కేంద్రేకరించారు. రాష్ట్ర వ్యాప్తంగా చేనేతను ప్రోత్సహించడానికి ప్రతి సోమవారం అధికారి నుండి సిబ్బంది వరకు విధిగా చేనేత వస్త్రాలను ధరించాలన్న రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కే.టీ.రామారావు పిలుపు మేరకు జీహెచ్ఎంసీలోని అధికారులందరూ సోమవారం కాటన్ దుస్తులను ధరించారు. జీహెచ్ఎంసీ కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్ తోసహా అడిషనల్ కమిషనర్లు, జోనల్, డిప్యూటి కమిషనర్లతో పాటు అన్ని విభాగాలధిపతులు కూడా కాటన్ వస్త్రాలను ధరించి విధులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. కాటన్ దుస్తులు ధరించడం వల్ల ఎంతో సౌకర్యంగా ఉందంటున్నారు.
కాటన్ దుస్తుల వల్ల ఆత్మస్తైర్యం కూడా మరింత పెరిగిందని పేర్కొన్నారు. చేనేతను ప్రోత్సహించేందుకు మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు నిచ్చారు. అయన పిలుపునకు హైదరాబాద్ మహా నగర పాలకమండలి (జీహెచ్ఎంసీ) అధికార యంత్రాంగం ముందుగా స్పందించింది. దీనితో బల్దియాలో దాదాపు 90శాతం అధికారులు, సిబ్బంది చేనేత వస్త్రాల పట్ల తమ ఆసక్తిని ప్రదర్శించారు. కాటన్ దుస్తులను ధరించడంలో ఆదర్శంగా నిలిచారని అధికారులు తెలిపారు. కాగా ప్రతి ఒక్కరూ చేనేత దుస్తులు ధరించాలన్న పిలుపుకు స్పందించి అన్ని జోనల్ కార్యాలయాల్లో అధికారులు సిబ్బంది కూడా చేనేత వస్త్రాలను ధరించారని ఆయా జోనల్ కమిషనర్లు తెలిపారు.
మంత్రి, మేయర్, ముఖ్య కార్యదర్శి తో సహా జీహెచ్ఎంసీ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశానికి హాజరైన ప్రముఖులందరూ చేనేత దుస్తులను ధరించారు. మంత్రి కే.టీ.ఆర్, మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటి మేయర్ బాబా ఫసియుద్దిన్ తో సహా ఆరోగ్య శాఖ స్పెషల్ సీ.ఎస్ శాంతి కుమారి, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్, జిహెచ్ఎంసి కమీషనర్ లోకేష్ కుమార్, జలమండలి ఎండీ దానకిషోర్, అడిషనల్, జోనల్, డిప్యూటి కమీషనర్లు, ఇoజనీర్లు వివిధ విబాగాల అధికారులు చేనేత వస్త్రాలను ధరించారు.