దోమ కాటుకు ఎవరు అతీతం కాదని మరోసారి తేలింది . రాష్ట్ర ముఖ్యమంత్రి మనవరాలు ... మున్సిపల్ శాఖ మాత్యుని కూతురుకు కూడా దోమకాటు తప్పలేదు . తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం నివసించే ప్రగతిభవన్ లోను దోమల బెడద ఉందని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు . తమ కూతురు కూడా దోమకాటు కు గురైందని అయన చెప్పుకొచ్చారు . హైదరాబాద్ లో విష జ్వరాలు విజృంభిస్తోన్న నేపధ్యం లో, మున్సిపల్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కేటీఆర్, మున్సిపల్ అధికారులతో సమీక్షాసమావేశం నిర్వహించారు .
ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ దోమకాటు పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు . విషజ్వరాలు వచ్చిన వెంటనే వైద్యం తీసుకోవాలని , అదేసమయం లో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు . తమ కూతురు కూడా దోమకాటు కు గురైందని, తాము స్వైన్ ఫ్లూ అనుకున్నామని కానీ విషజ్వరం అని తేలిందని చెప్పారు . హైదరాబాద్ లో ఏ ఆసుపత్రి చూసిన విషజ్వరాల బాధితులతోనే నిండిపోయి ఉన్నాయి . ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సౌకర్యాలు సరిగ్గా అందడం లేదని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు . బాధితులకు మెరుగైన వైద్య సదుపాయాలను అందించాలని ఇప్పటికే కేసీఆర్ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది.
ప్రభుత్వ ఆసుపత్రులను వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ సందర్శించి బాధితులను కలిసి , పరిస్థితి అడిగి తెలుసుకుంటున్నారు . గాంధీ ఆసుపత్రి సందర్శించిన ఈటెల, బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రి వైద్యులను ఆదేశించారు . ఇక దోమల నివారణకు అన్ని చర్యలు తీసుకోవాలన్న మంత్రి కేటీఆర్, దోమలపై యుద్ధం ప్రకటిస్తున్నట్లు తెలిపారు . ప్రజలంతా కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు .