ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు జ్వరాల బారిన పడుతున్నారు. ముఖ్యంగా డెంగ్యూ జ్వరాలు సోకి ప్రజలు బాధపడుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలన్నీ జ్వర పీడితులతో నిండి పోతున్నాయి. దీంతో ప్రభుత్వాలు అప్రమత్తమై డెంగ్యూ ప్రబలకుండా చర్యలు తీసుకుంటున్నాయి. మన చుట్టూ ఉండే పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని సూచిస్తున్నాయి. దీనిలో భాగంగా తెలంగాణ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చేసిన ఓ ట్వీట్ కు హీరో ప్రభాస్ మద్దతిచ్చాడు.

 


కేటీఆర్ తన ట్విట్టర్ వేదికగా డెంగ్యూ జ్వరాలు రాకుండా ఏం చేయాలో పలు సూచనలు చేస్తూ తాను తీసుకుంటున్న చర్యలపై ఫోటోలను పోస్ట్ చేసారు. 'వైరల్ జ్వరాలు, డెంగ్యూ జ్వరాలు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోండి. మీ ఇంటి పరిసరాలలో ఉన్న నీటి తోటలు, పూల కుండీలు, ఎయిర్ కూలర్లలో నీటి నిల్వ లేకుండా చూసుకోండి. దోమల వ్యాప్తికి ఇదే ప్రధాన కారణం. నేను నా ఇంటి పరిసరాలలో నీటి నిల్వలు లేకుండా చేసుకున్నాను. మీరు కూడా ఇలానే తగిన జాగ్రత్తలను తీసుకుని ఆ ఫోటోలను నాతో పంచుకోండి' అని ట్వీట్ చేశారు. కేటీఆర్ చేసిన పనిని మెచ్చుకుంటూ టాలీవుడ్ బాహుబలి ప్రభాస్ తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా మద్దతు తెలిపారు. కేటీఆర్ పోస్ట్ చేసిన ఫోటోలను ప్రభాస్ షేర్ చేస్తూ.. 'వైరల్ జ్వరాలు, డెంగ్యూ రాకుండా మీ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోండి.. దయచేసి ఈ విషయాన్ని అందరికీ చేరేలా చూడండి. ఆరోగ్యంగా ఉండండి” అని షేర్ చేశాడు.

 


దీనిపై ‘ఈ విషయంలో సపోర్ట్ చేసినందుకు థాంక్స్ ప్రభాస్’ అంటూ కేటీఆర్ రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది. జ్వరాలు రాకుండా తీసుకునే జాగ్రత్తలపై సెలబ్రిటీలు ఇలా ప్రజల్లో అవగాహన కల్పించడం మంచి పరిణామం.

 


మరింత సమాచారం తెలుసుకోండి: