ఏపీ ప్రభుత్వం ఉగాది నాటికి ఇరవై ఐదు లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకొంది. ఇందుకు కావలసిన భూములు సేకరించడానికి రంగం సిద్ధం చేస్తోంది. అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూమిని పట్టాల కోసం రెడీ చేయాలని కలెక్టర్ లకు ఆదేశాలు జారీ చేయడంతో పాటు మంత్రులు జిల్లాల వారీ పర్యటనలు కూడా చేపట్టబోతున్నారు. అదే సమయంలో పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కరించి ల్యాండ్ బ్యాంక్ పెంచుకోవాలన్న వ్యూహం రచిస్తోంది జగన్ సర్కార్.

పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఏపీ సర్కార్.మూడు నెలల పాలన కాలంలో ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాల్లో ఇళ్ల పట్టాల పంపిణీ ప్రధానమైంది. గత ప్రభుత్వాల మాదిరి కాకుండా ఈ కార్యక్రమాన్ని పక్కాగా అమలు చేసేందుకే కొంత టైమ్ తీసుకోవాలని సర్కార్ భావించింది. అందుకే వచ్చే ఉగాది నాటికి పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీని చేపట్టాలని డిసైడ్ అయ్యారు జగన్. అయితే ఈలోగా ఇరవై ఐదు లక్షల మందికి పంపిణీ చేయాల్సిన భూమిని గ్రామాల వారీగా సేకరించుకోవల్సిన అవసరం ఉంది.

దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడెక్కడ ఎంత వరకు భూమి అందుబాటులో ఉందో నివేదిక సిద్ధం చేయాలని కలెక్టర్ లకు సూచించింది. దీంతో జిల్లా కలెక్టర్ లు గ్రామాల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూమిని గుర్తించే పనిలో ఉన్నారు.ఇళ్ల పట్టాల పంపిణీ వ్యవహారంలో జరుగుతున్న కార్యక్రమాల పరిశీలనకు మంత్రులు జిల్లాల పర్యటనలు చేపడుతున్నారు. డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ తో పాటు రంగనాథరాజు ఈ నెల పదిహేడు నుంచి జిల్లా పర్యటనలు చేపడతారు. పశ్చిమ గోదావరి జిల్లాతో మొదలు పెట్టి అన్ని జిల్లాల్లో వరుస పర్యటనలు చేయనున్నారు మంత్రులు.

ఈ క్రమంలో జిల్లాలో అందుబాటులో ఉన్న భూమికి సంబంధించిన వివరాలతో పాటు లబ్ధిదారుల జాబితాను కూడా వీలైనంత వరకు సిద్ధం చేసి వుంచాలని ఆదేశించారు. ఈ క్రమంలో క్షేత్ర స్థాయిలో భూ సమీకరణకు ఎదురయ్యే సమస్యలను వీలుంటే అక్కడికక్కడే పరిష్కరించే దిశగా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.పదమూడు జిల్లాల్లో క్షేత్ర స్థాయి పర్యటనను ముగించుకున్నాక ఇళ్ల పట్టాల పంపిణీకి సంబంధించి భూ లభ్యతపై సీఎంకు నివేదిక ఇవ్వనున్నారు, మంత్రులు ఒకవేళ అనుకున్న స్థాయిలో భూమి లభించనట్లయితే ప్రైవేటు భూములను కొనుగోలు చేసైనా సరే ఇళ్ల పట్టాల కోసం సిద్ధంగా ఉంచాలని ప్రభుత్వం భావిస్తోంది.

దీనికి సంబంధించిన కసరత్తును కూడా జిల్లాల పర్యటనల్లో మంత్రులు పూర్తి చేయనున్నారు. వీలైనంత మేరకు ప్రభుత్వ భూమినే సమీకరించుకునే ప్రయత్నాలు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది సర్కార్. ఈ క్రమంలో భూములకు సంబంధించి ప్రభుత్వానికి వ్యక్తులకు పెండింగులో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించే దిశగా కృషి చేయాలని భావిస్తోంది. ల్యాండ్ సీలింగ్ వివాదాలకు సంబంధించిన కేసులను పరిష్కరించాలని భావిస్తోంది.ఈ కేసులో పరిష్కారమైతే పెద్ద ఎత్తున భూమి ప్రభుత్వానికి అందుబాటులోకి వస్తుందని అంచనా వేస్తోంది సర్కార్. మండపేట నియోజక వర్గంలో ల్యాండ్ సీలింగ్ వివాదాల్లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తే సుమారు మూడు వందల ఎకరాల భూమి అందుబాటులోకి రానుందని విషయం డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోసు దృష్టిలోకి వచ్చింది.

ఈ క్రమంలో ఇదే తరహాలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ల్యాండ్ సీలింగ్ కేసుల్లో ఉన్న భూ తగాదాలను పరిష్కరిస్తే పెద్ద ఎత్తున భూమి అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉంది. దీంతో రెవిన్యూ యంత్రాంగం ల్యాండ్ సీలింగ్ కేసులకు సంబంధించిన ఫైళ్ల దుమ్ము దులుపనున్నారు. ప్రార్థనా మందిరాలు ఎండోమెంట్స్ కు సంబంధించిన భూముల విషయంలో ఆచి తూచి వ్యవహరించాలని అధికారులను ఆదేశిస్తున్నారు. వీటిని టచ్ చేస్తే లేనిపోని వివాదం ఉన్న ప్రభుత్వం నెత్తికెత్తుకోవాల్సి వస్తుందని భావిస్తున్న సర్కార్ వీటి విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: