తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీలో విభేదాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. అయితే పార్టీ ఎప్పట్నుంచో విబేధాలు ఉన్నప్పటికీ వాటిని పక్కన పెట్టి మొన్నటి వరకు అవి బయటకు రాలేదు, రెండో మంత్రి వర్గ విస్తరణ అనంతరం పార్టీ తన అభిమాన నాయకుల కోసం కార్యకర్తలు అభిమానులు మాటల దాడికి దిగుతున్నారు. అంతలా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు, సోషల్ మీడియా కోడై కూస్తున్న నాయకుడు. మొన్నటి వరకు మంత్రి పదవి ఇవ్వలేదని చర్చ, ఇప్పుడు పోయి పోయి అదే శాఖ ఎందుకిచ్చారని చర్చ, హరీశ్ రావు విషయంలోనే ఎందుకీ రచ్చ. అటు రాజకీయ వర్గాల్లో ఇటు సోషల్ మీడియా గ్రూపుల్లోనూ ఇదే డిస్కషన్స్ జరుగుతుంది. ఎవరికి తోచిన రీతిలో వాళ్లు భాష్యం చెప్పుకుంటున్నారు.


హరీశ్ రావు అభిమానులకైతే ఒక వైపు సంబరం మరోవైపు ఆందోళన. హరీశ్ రావుకు ఆర్థికశాఖ నేపథ్యంలో ఎందుకిలాంటి చర్చకు ఆస్కారం ఏర్పడుతుంది. దాదాపు 10 నెలల పాటు నియోజకవర్గానికి పరిమితమైన హరీశ్ రావును ఇప్పుడు మంత్రి వర్గంలోకి ఎందుకు తీసుకున్నట్లు, మంత్రి పదవి ఇచ్చి గౌరవించారని ఆయన అభిమానులు సంతోషించాలా లేక ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న రాష్ట్రంలోని పరిస్థితుల్ని చక్కదిద్దే బాధ్యతను అప్పజెప్పారనుకోవాలా. నిజంగా ఆయన పని తీరుకు పరీక్ష పెట్టడమేనా లేక ఇంతకాలం హరీశ్ రావును పక్కన పెట్టారని పార్టీ కార్యకర్తల్లో జరుగుతున్న చర్చను అసంతృప్తిని చల్లార్చే ప్రయత్నంలో భాగమా అనే అనుమానాలు, ప్రశ్నలు హరీశ్ రావు అభిమాన వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి.


సోషల్ మీడియాలో అయితే ఎవరికి వారు తమకు తోచిన భాష్యం జోడిస్తున్నారు. దీంతో హరీశ్ రావుకు ఆర్థిక శాఖపై జోరుగా చర్చ జరుగుతోంది. హరీశ్ రావు మంత్రి పదవి ఇవ్వకుండా పక్కకు పెట్టినందుకు ఇంతకాలం ఒకలాంటి చర్చ జరిగితే ఇప్పుడు మంత్రి పదవి ఇచ్చినందుకు మరో రకమైన చర్చ మొదలైంది. ప్రస్తుతం ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న రాష్ట్రాన్ని గాడిలో పెట్టడం ప్రభుత్వానికి తక్షణ కర్తవ్యం. ఇలాంటి పరిస్థితుల్లో సమర్థుడిగా గుర్తింపు పొందిన హరీశ్ రావుకు ఆర్థిక శాఖను అప్పచెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తలో నీళ్ల కోసం సాగు నీటి పారుదల శాఖను హరీశ్ రావుకు కేటాయించారు. ఆయన పర్యవేక్షణలోనే కాళేశ్వరం ప్రాజెక్టు పనులు అత్యంత వేగంగా జరిగాయి.


తాజాగా ఇప్పుడు ఆర్థిక మాంధ్యం నేపథ్యంలో మరోసారి కీలకమైన బాధ్యతలను అప్పగించారు కేసీఆర్. ఒకవైపు దేశవ్యాప్తంగా జీఎస్టీ వసూలు తగ్గిపోతుండటం, నిరుద్యోగ సమస్య తీవ్రం అవుతుండటం, రాష్ట్ర ఆర్ధిక వనరులు కుదించుకు పోతుండటం, గడిచిన 5 ఏళ్లలో అప్పులు భారీ స్థాయిలో పెరగడం, వాటిని వడ్డీతో సహా చెల్లించే భారం మీద పడటం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయడానికి మరింతగా అప్పులు చేయాల్సి రావడం, ఎఫ్ఆర్బీఎం పరిధి కంటే ఎక్కువ అప్పులు చేయాల్సి రావడం ఇలా అనేక సవాళ్ల నేపథ్యంలో హరీష్ కు ఆర్థిక శాఖ బాధ్యతలు చేపట్టారు. కేంద్రంతో స్నేహ పూర్వక సంబంధాలు కొనసాగిస్తూ వీలయినంత ఎక్కువ స్థాయిలో గ్రాంట్ లో ఆర్ధిక సాయాన్ని తీసుకురావటం వివిధ రూపాల్లో రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా వివిధ ద్రవ్య సంస్థల నుంచి రుణాలు సమకూర్చుకోవడం,


రాష్ట్ర అవసరాలపై స్పష్టత ఉన్న దృష్ట్యా పరిమిత ఆర్థిక వనరులను సమర్థవంతంగా కేటాయించడం హరీశ్ రావు ముందున్న ప్రధాన సవాళ్లు అంటున్నారు ఆర్థిక నిపుణులు. అయితే ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు పథకాలను అమలు చేయడం వాటికి నిధులు విడుదల చేయడం హరీశ్ రావుకు కత్తిమీద సామేనంటున్నారు. సెక్రటేరియట్ వర్గాల్లో రాజకీయాల్లో ట్రబుల్ షూటర్ గా గుర్తింపు పొందిన హరీశ్ రావు ఈ బాధ్యతల్లో ఏ మేరకు సక్సెస్ సాధిస్తారు. భవిష్యత్ లో ఆయన రాజకీయ ప్రాధాన్యత ఏ మేరకు పెరుగుతుంది అని కూడా అంటున్నారు. ఆయన వీరాభిమానులు చూడాలి హరీశ్ రావు ఆర్థిక శాఖ ముళ్లకిరీటం అవుతుందో లేదంటే పట్టిందల్లా బంగారం అయినట్లు బంగారు కిరీటం అవుతుందో.





మరింత సమాచారం తెలుసుకోండి: