ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం జ్యుడిషియల్ కమిటీ ఏర్పాటులో మరో ముందడుగు వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి శివశంకరరావును జ్యూడిషియల్ ప్రివ్యూ ప్రక్రియ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి సి ప్రవీణ్ కుమార్ జ్యుడిషియల్ కమిటీ కోసం జస్టిస్ శివశంకరరావు పేరును సూచించినట్లు తెలుస్తుంది. 
 
వైసీపీ ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులను కూడా జారీ చేయటం జరిగింది. మూడు సంవత్సరాల పాటు ఈ పదవిలో జస్టిస్ శివశంకరరావు కొనసాగనున్నారు. 100 కోట్ల రుపాయలు దాటిన ప్రతి టెండర్ ను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో జ్యూడిషియల్ కమిటీ సమీక్షిస్తుంది. ఏపీ సీఎం వై యస్ జగన్మోహన్ రెడ్డి టెండర్ల విధానాన్ని అత్యంత పారదర్శకంగా, ప్రాజెక్టుల నిర్మాణంలో ఎటువంటి అవినీతికి చోటు లేకుండా ఉండటం కొరకు జ్యుడిషియల్ కమిటీని తీసుకొని రావటానికి కృషి చేశారు. 
 
జ్యుడిషియల్ కమిటీని తీసుకొనిరావటం కొరకు ఏపీ ప్రభుత్వం జ్యుడిషియల్ కమిషన్ బిల్లుకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఇప్పటికే ఆమోదం తెలిపింది. జ్యుడిషియల్ కమిషన్ బిల్లు ప్రకారం 100 కోట్ల రుపాయలు దాటిన అన్ని మౌలిక సదుపాయల ప్రాజెక్టులు పనులను ప్యాకేజీలుగా విభజించినా కూడా జ్యుడిషియల్ కమిషన్ పరిధిలోకి వస్తాయి. జడ్జి ఈ ప్రాజెక్టులకు సంబంధించిన ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తారు. 
 
కొంతమంది నిపుణులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జడ్జికి సహాయకులుగా నియమిస్తుంది. జడ్జి ఏవైనా సిఫార్సులు చేసిన పక్షంలో సంబంధిత శాఖ వాటిని తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. టెండరు ప్రతిపాదన ఖరారు మొత్తం ఈ కొత్త విధానం ద్వారా 15 రోజుల సమయంలో పూర్తి అవుతుంది. జ్యుడిషియల్ కమిషన్ బిల్లును అమలు చేయటం ద్వారా అర్హత ఉన్న కాంట్రాక్టర్లందరికీ సమాన అవకాశాలు లభించటంతో పాటు ప్రజాధనం దుర్వినియోగం కాకుండా ఉంటుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: