ఏపీలో కనీసం సొంతంగా పోటీ చేసి వార్డు కూడా గెలువలేని స్థితిలో విలవిల్లాడుతోన్న బీజేపీ పాత దేవుడును వదిలించుకుని కొత్తా దేవుడిని రంగంలోకి దింపుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఏపీ బీజేపీకి ఎన్నికల ముందే కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ రథసారధిగా వచ్చారు. ఎన్నికలకు ముందు వరకు ఏ పార్టీలోకి వెళ్లాలో తెలియక డైలమాలో ఉన్న కన్నా చివరకు వైసీపీలోకి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. చివర్లో ఆ పార్టీకి ఆయన షాక్ ఇచ్చి బీజేపీలో చేరారు. కన్నా బీజేపీలో చేరడం వెనక పెద్ద డ్రామానే నడిచింది.
చివరకు ఆ పార్టీ తరపున ఎన్నికల్లో గుంటూరు జిల్లా నరసరావుపేట నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన కన్నా... రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసే విషయంలో వెనుకబడినట్టు బిజెపి జాతీయ నాయకత్వం భావిస్తోంది. ఏపీలో బీజేపీ ఘోరంగా చతికిలపడింది. అయితే మరోసారి మోదీ నాయకత్వంలోని ఎన్డీయే అధికారంలోకి రావడంతో కన్నాకు ఏపీలో పెద్ద టాస్క్ పడింది. అటు అధికార వైసీపీతో పాటు ఇటు టీడీపీని కూడా ధీటుగా ఎదుర్కొని పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఏర్పడింది. అయితే ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపీకి చెందిన పలువురు కీలక నేతలు, రాజ్యసభ సభ్యులు బీజేపీలోకి వెళ్లి ఇప్పుడు వారి ఆధిపత్యం చాటుతున్నారు. దీంతో కన్నా పూర్తిగా డమ్మీగా మారిపోయారు.
అంతే కాకుండా కన్నా వల్ల ఏపీలో బీజేపీ బలపడదు అన్న విషయం కూడా పార్టీ నేతలకు క్లీయర్గా అర్థమైంది. దీంతో కన్నాను తప్పించేసి కొత్త నేతకు ఏపీ బీజేపీ పగ్గాలు అప్పగించేందుకు అంతా రంగం సిద్ధం చేస్తున్నారు. టీడీపీ నుంచి బీజేపీలోకి జంప్ చేసిన నేతల్లో ఎవరో ఒకరికి ఏపీ బీజేపీ పగ్గాలు అప్పగించే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. చంద్రబాబుకు నిన్న మొన్నటి వరకు సన్నిహితంగా ఉండి పార్టీ మారిన నేతలకు ఏపీ బీజేపీ పగ్గాలు అప్పగిస్తేనే టీడీపీని ఖల్లాస్ చేసి ఆ ప్లేస్లోకి బీజేపీ వస్తుందన్నదే బీజేపీ జాతీయ నాయకత్వం ఆలోచనగా తెలుస్తోంది.