ఆర్టికల్ 370 రద్దు తరువాత ఇండియా పాక్ దేశాల మధ్య సంబంధాలు పెద్దగా బాగాలేవు. పెద్దగా అని చెప్పేకంటే.. అస్సలు బాగాలేదు అని చెప్పొచ్చు. ఎందుకంటే.. ఇండియాపై నిత్యం పాక్ మండిపడుతూనే ఉన్నది.. అటు అంతర్జాతీయంగా ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నది. పాపం ఆ ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి. చైనాను అడ్డం పెట్టుకొని రాజకీయం చేయాలని చూస్తున్నది.
చైనా సపోర్ట్ తో ఐక్యరాజ్యసమితి కంప్లైంట్ చేసింది. అయినప్పటికీ లాభం లేకపోయింది. అయితే, కాశ్మీర్ విషయాన్ని అంతర్జాతీయ వేదికపైకి తీసుకెళ్లగలిగామని జబ్బలు చరుచుకుంటోంది. జమ్మూ కాశ్మీర్ అంశం ఇండియా అంతర్గత విషయం అని దాని విషయంలో జోక్యం చేసుకోలేమని పలు దేశాలు ఇప్పటికే స్పష్టం చేశాయి. అయినా పాక్ కు బుద్దిరావలేదు. ఇంకా రచ్చ చేస్తూనే ఉన్నది. పీవోకే విషయంలో రెండు దేశాలు కలిసి కూర్చొని మాట్లాడుకోవాలని కూడా హితవు పలికాయి ప్రపంచదేశాలు. కానీ, పాక్ వినే పరిస్థితిలో లేదు.
ఇండియాపై ఎలాగైనా పైచేయి సాధించాలి. కాశ్మీర్ ను సొంతం చేసుకోవాలి. కాశ్మీర్ లోకి ఉగ్రవాదులను పంపించాలి.. అలజడులు సృష్టించాలి. ఇదే ఆ దేశం అజెండాగా పెట్టుకుంది. పదేపదే పీవోకేలోకి ఉగ్రవాదులను పంపడం నుంచి.. వారిని అక్రమంగా ఇండియాలోకి తరలించడం వంటివి చేస్తున్నది. ఇండియాలో అలజడులు సృష్టించి తద్వారా కాశ్మీర్ విషయంలో పైచేయి సాధించాలన్నది పాక్ ఎత్తుగడ. ఆ ఎత్తుగడలను ఎప్పటికప్పుడు ఇండియా నిర్వీర్యం చేస్తూనే ఉన్నది.
ఇక ఇదిలా ఉంటె, ఇండియాతో చర్చలు జరిపినంత మాత్రనా ఉపయోగం లేదని, చర్చలతోనే సమస్య పరిష్కారం కాదని పాక్ విదేశాంగ మంత్రి ఖురేషి పేర్కొన్నారు. దీని అర్ధం ఏంటి.. చర్చలతో పరిష్కారం కాదంటే యుద్ధం చేస్తామని అర్ధం చేసుకోవాలా..? యుద్ధం చేయడం అంటే మాములు విషయం కాదు. ఈ సమయంలో యుద్ధం అంటే.. కోట్లాది రూపాయలు ఖర్చు అవుతాయి. యుద్ధం చేస్తే ఏం జరుగుతుందో పాక్ కు తెలిసిన విషయమే. ఇప్పటికే మూడు యుద్ధాల్లో పాక్ పై ఇండియానే పైచేయి సాధించింది. ఇప్పుడు మరలా యుద్ధం చేయడానికే పాక్ సిద్ధమైతే పీవోకే ను తిరిగి ఇండియాలో విలీనం చేసుకోవడం పెద్ద కష్టం కాదు. పీవోకే ను తిరిగి స్వాధీనం చేసుకుంటే.. దాని వలన నష్టపోయేది ఒక్క పాక్ మాత్రమే కాదు అటు చైనా కూడా నష్టపోతోంది. ఎందుకంటే.. ఈ పీవోకే నుంచే చైనా.. పాక్ కు ఎకనామిక్ కారిడార్ ను నిర్మించాయి. ఈ ఎకనామిక్ కారిడార్ పై ఇండియా ఇప్పటికే సీరియసైనా సంగతి తెలిసిందే.