రానున్న రోజుల్లో మరిన్ని పోలీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయనున్నట్టు రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. పోలీస్ ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకునే వారాంతపు సెలవుల విధానాన్ని ప్రవేశపెట్టామని చెప్పారు. రాష్ట్రంలో పోలీస్ శాఖలోని వివిధ పోలీస్ కానిస్టేబుళ్ల ఖాళీల భర్తీకి నిర్వహించిన వ్రాతపరీక్షా ఫలితాలను వెల్లడించారు. పోలీస్ కానిస్టేబుళ్లుగా ఎంపికైన వారిందరికీ సియం తరుపున అభినందనలు తెలిపారు. గురువారం అమరావతి సచివాలయంలోని నాల్గవ భవనం ప్రచార విభాగంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి సుచరిత మాట్లాడారు.  పోలీస్ శాఖలోని 2వేల 723 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశామన్నారు. అందుకుగాను  మొత్తం 3లక్షల 94వేల 384 మంది అభ్యర్ధులు ధరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. ప్రిలిమినరీ పరీక్ష, ఫిజికల్ మెజర్మెంట్,ఫిజికల్ ఎపిషియెన్సీ వంటీ పరీక్షలలో  65వేల 575మంది వ్రాత పరీక్షలకు అర్హత పొందారన్నారు. అర్హత సాధించిన అభ్యర్థులకు నిర్వహించిన వ్రాత పరీక్షలలో  2వేల 673 మంది మాత్రమే ఉత్తీర్ణతను సాధించారని చెప్పారు.



ఇందులో కడప జిల్లాకు చెందిన జింకా శశికుమార్, గుంటూరు జిల్లాకు చెందిన చల్లా సత్యనారాయణ, ప్రకాశం జిల్లాకు చెందిన సిద్దారెడ్డి చెన్నారెడ్డి, విజయనగరం జిల్లాకు చెందిన వడపల్లి కోటేశ్వరరావులు 145కు పైగా మార్కులు సాధించి ఉత్తమ ప్రతిభను   కనబర్చారని చెప్పారు. అదే విధంగా మహిళలకు సంబంధించి విజయనగరం  జిల్లాకు చెందిన లక్ష్మీ ప్రియాంక 138 మార్కులతో మొదటి స్థానంలో నిలిచారన్నారు. పోలీస్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్ధుల సర్టిఫికేట్లు వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయ్యాక ఎంపికైన అభ్యర్తులకు శిక్షణా కార్యక్రమాన్ని చేపడతామన్నారు.  ఎస్సిటి సివిల్ కానిస్టేబుళ్లు(పురుష,మహిళ)కు సంబంధించి 1600 ఖాళీలకు గాను 1098 పురుషులు,430 మహిళలు మొత్తం కలిపి 1528 ఖాళీలు భర్తీ చేస్తుండగా మరో 72 ఖాళీలను తర్వాత భర్తీ చేయనున్నామన్నారు. అలాగే ఎస్సిటి కానిస్టేబుళ్లు ఎఆర్ (పురుష,మహిళ)300 ఖాళీలలకుగాను 232 పురుష,47 మహిళల ఖాళీలను భర్తీ చేస్తున్నామని చెప్పారు. 





ఎస్సిటి కానిస్టేబుళ్లు ఎపిఎస్పి పురుషులకు సంబంధించి 300 ఖాళీలను భర్తీ చేస్తున్నట్టు తెలిపారు. అదేవిధంగా వార్డర్స్ పురుషులు100 ఖాళీలు, వార్డర్స్ మహిళలు 23 ఖాళీలను భర్తీ చేస్తున్నట్టు తెలిపారు. అలాగే ఫైర్ మెన్ పురుషులు 400 ఖాళీలకు గాను 393 ఖాళీలను భర్తీ చేస్తున్నామన్నారు. మొత్తం 2వేల 723 ఖాళీలకుగాను ప్రస్తుతం 2వేల 623 పోస్టులను భర్తీ చేస్తుండగా మిగతా 100 ఖాళీలను త్వరలో భర్తీ చేశామని మంత్రి తెలిపారు. ప్రస్తుతం పల్నాడులో శాంతిభద్రతలు పూర్తిగా అదుపులోనే ఉన్నాయని హోం మంత్రి   సుచరిత తెలిపారు. పల్నాడు విషయంలో ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తుందన్న విమర్శలు ఎంతమాత్రం సమంజసం కాదన్నారు. పల్నాడులో ఏదో జరిగిపోతుందని కొన్ని పార్టీల నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని చెప్పారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు ప్రయత్నించే ఎవరినైనా ఉపేక్షించేది లేదని మంత్రి స్పష్టం చేశారు.అలాగే దళితులను కించపరిచేలా ఎవరు మాట్లాడినా అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని  హెచ్చరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అధ్యక్షులు కుమార్ విశ్వజిత్ తదితరులు పాల్గొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: